న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం కిశోర్ చంద్రదేవ్ మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశానని చెప్పారు. అంతేగాక, త్వరలో తాను టీడీపీలో చేరనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని అన్నారు. ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే విషయం భేటీలో ప్రస్తావనకు రాలేదని కిశోర్ చెప్పారు.
ఇటీవల కిశోర్ చంద్రదేవ్ కాంగ్రెస్ పార్టీపై తన అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్కు రాజీనామా చేసినట్లు అప్పుడే ప్రకటించారు. దీంతో కిశోర్ చంద్రదేవ్ టీడీపీలో చేరనున్నారని జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా, టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ కావడం, ఆ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించడంతో ఆ ప్రచారం నిజమైనట్లైంది.