
అమరావతి: ఏపీలో ఎన్నిలక వేడి రోజు రోజుకి పెరిగిపోతుంది. ఎన్నికల పోలింగ్ ముగిసింది కదా వేడి తగ్గుతుందిలే అనుకుంటే , ఫలితాల సమయం ఎక్కువగా ఉండటంతో ఈ వేడి మరింత ఎక్కువగా ఉంది. ఇప్పటికే అధికారం లేదు అని సీఎస్ టీడీపీ నేతలని అంటుండటం తో వారు మండిపోతున్నారు. ఇదే సమయంలో ఇరు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ టీడీపీ కి మరో షాక్ ఇచ్చాడు.
ఈ నెల 10వ తేదీ లోపు కిడారి శ్రవణ్ తో రాజీనామా చేయించాలని గవర్నర్ నరసింహన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. మావోయిస్టుల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మృతి చెందడంతో ఆయన కుమారుడు కిడారి శ్రవణ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలోకి తీసుకున్న విషయం తెలిసిందే.
గత ఏడాది నవంబర్ 11న ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే కిడారి శ్రవణ్ కుమార్ ఆరు నెలల్లోగా ఏదో చట్టసభల్లో సభ్యుడిగా ఉండాలి. కానీ ఈ మధ్య ఏ చట్ట సభలలోను అయన ఎన్నిక కాలేదు. దీనితో గడువు ముగుస్తున్నందున ఆయనతో రాజీనామా చేయించాలని కోరాడు.
ఈ మేరకు రాజ్భవన్ అధికారులు మంగళవారం సాయంత్రం ఏపీ సర్కార్కు సమాచారం అందించింది. కాగా రాజ్యాంగం ప్రకారం మంత్రి పదవి చేపట్టి ఆరు నెలలలోపు చట్టసభల్లో సభ్యుడిగా ఎన్నిక అవ్వాల్సి ఉంటుంది. లేకుంటే పదవి కోల్పోవాల్సి ఉంటుంది. మరోవైపు ఈ విషయంపై కిడారి శ్రవణ్ కుమార్ ఇవాళ ముఖ్యమంత్రిని కలవనున్నట్లు తెలుస్తోంది. ఆయన సూచన మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.








