
అమరావతి: వైఎస్సార్సీపీ అభ్యర్థిగా విజయవాడ పార్లమెంటు నుంచి పోటీ చేస్తున్న పొట్లూరి వరప్రసాద్(పీవీపీ)పై టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన ఆరోపణలు చేశారు. ప్రముఖ సినీనటి శృతిహాససన్ను పీవీపీ బ్లాక్మెయిల్ చేసి, కాల్ షీట్లు తీసుకున్నారని ఆరోపించారు. సినీ పరిశ్రమలో ఎందరో హీరోయిన్లను ఏడిపించారని, మహేష్ బాబును తప్ప ప్రతి హీరోను ఇబ్బంది పెట్టారని అన్నారు.
ఒక్క మహేష్ బాబు మాత్రమే పీవీపీ చేతికి చిక్కలేదని కేశినేని వ్యాఖ్యానించారు. డైరెక్టర్లను కూడా పీవీపీ ఏడిపించారని విమర్శించారు. లీగల్ నోటీసుల పేరుతో బ్లాక్ మెయిల్ చేసి, డేట్లను తీసుకునేవారని ఆరోపించారు. సినిమా ఇండస్ట్రీకి ఇతనంటే అసహ్యం పుట్టిందని అన్నారు.
పీవీపీ ఓ క్రిమినల్..
పీవీపీ ఓ క్రిమినల్, ఒక మోసగాడంటూ కేశినేని నాని విమర్శించారు. చిన్నప్పటి నుంచే అతడు నేరగాడని నాని ఆరోపించారు. కెనరా బ్యాంకుకు రూ. 137కోట్లు ఎగ్గొడితే మొన్ననే నోటీసులు ఇచ్చారని తెలిపారు. ఇతను తాకట్టు పెట్టిన ఆస్తిని బ్యాంకు వాళ్లు వేళం వేస్తే కనీసం రూ. 7 కోట్లు కూడా రాలేదని చెప్పారు.
జగతి పబ్లికేషన్లో రూ. 147 కోట్ల మనీలాండరింగ్ కేసులు, హవాలా కేసులు, బొగ్గు స్కాములు ఉన్నాయని కేశినేని నాని ఆరోపించారు. సెబి కూడా రూ. 30కోట్ల జరిమానా వేసిందని చెప్పారు. కాగా, కేశినేని నాని కూడా టీడీపీ తరపున విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పీవీపీపై విమర్శలు చేయడం గమనార్హం.








