
మంత్రివర్గ విస్తరణకు జూన్ 8 తేదీ ముహూర్తంగా నిర్ణయించడంతో కసరత్తుపై దాదాపు కొలిక్కివచ్చినట్టు సమాచారం. పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నారని, ఇందులో 45 శాతం వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకే అవకాశం ఇవ్వనున్నాడు అని సమాచారం.
ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం వైసీపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగే భేటీలోనే మంత్రుల పేర్లను సీఎం జగన్ వెల్లడించనున్నట్టు సమాచారం.
తాజాగా వైసీపీ ఎల్పీ సమావేశం లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదుగురిని ఉప ముఖ్యమంత్రులుగా ఆయన నియమించనున్నారు. దేశం యావత్తూ ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు వర్గాల నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేసి డిప్యూటీ సీఎంలుగా నియమిస్తానని ఈ ఉదయం జరిగిన పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో జగన్ చెప్పుకొచ్చాడు.
శనివారం నాడు 25 మంది మంత్రులతో పూర్తిస్థాయిలో క్యాబినెట్ ఏర్పాటవుతుందని జగన్ స్పష్టం చేశారు. మంత్రులుగా ఎంపికైన వారితో శనివారం ఉదయం 11.49 గంటలకు ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఇందుకు వెలగపూడిలోని సచివాలయం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో అధికారులు ఏర్పాట్టు చేస్తున్నారు.








