
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పరాజయం తరువాత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. పార్టీ ఓటమి మీద విశ్లేషణలు చేసుకున్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వం పని తీరు మీద చర్చించారు. అదే సమయంలో వారికి ఇక్కడ ఒక అవసరం వచ్చింది. అంతే, దీని పైన వెంటనే పార్టీ తరపున ముఖ్యమంత్రికి లేఖ రాయాలని నిర్ణయించారు.
దీనితో ఏపీ ముఖ్యమంత్రి జగన్కు మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు తొలి లేఖ రాసారు. డియర్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అని సంభోదిస్తూ ప్రారంభించిన లేఖలో తనకు ప్రస్తుతం ఉంటున్న నివాసాన్ని ప్రతిపక్ష నేత నివాసంగా గుర్తిస్తూ పక్కనే ఉన్న ప్రజా వేదికను అనుబందంగా కొనసాగించాలని కోరారు.
పూర్తి వివరాలు చూస్తే… మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్కు లేఖ రాసారు. కృష్ణా కరకట్ట మీద చంద్రబాబు నివాసం ఉంటున్న తన నివాసం పక్కనే తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజా వేదిక పేరుతో కొత్త కట్టడం పూర్తి చేసారు అని , ఆ భవనంలోనే పార్టీ, ప్రభుత్వ సమీక్షలు కొనసాగించాము అని తెలిపాడు.
అయితే, ఇప్పుడు టీడీపీకి అమరావతిలో కార్యాలయం సైతం లేకపోవటంతో తన నివాసం పక్కనే ఉన్న ప్రజావేదిక భవనాన్ని ప్రతిపక్ష నేత నివాసానికి అనుబంధంగా గుర్తించాలని చంద్రబాబు రాసిన లేఖలో చెప్పుకొచ్చాడు.
చదవండి: రేపు అమరావతికి జనసేనాని…పార్టీ ఓటమిపై నేతలతో సమీక్షలు…
ఒక పార్టీ అధినేతగా తనను కలిసేందుకు అనేకమంది ప్రజలు , రాజకీయ నేతలు వస్తుంటారని అందువల్ల ఈ భవనాన్ని తమకే కేటాయించాలని లేఖలో చంద్రబాబు చెప్పాడు. పార్టీ నేతలతో చర్చ సమయంలో ప్రజా వేదిక కొనసాగిస్తూ బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం కావటంతో చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదాలోనే ముఖ్యమంత్రికి ఈ లేఖ రాసినట్టు సమాచారం.
ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్కు రాసిన తొలి లేఖపైన జగన్ ఏరకంగా స్పందిస్తారనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిమొదలైంది. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న సమయంలో కూడా ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న ఇల్లు ఆక్రమించి కట్టినదని, నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించిందని విమర్శలు చేస్తూ వచ్చారు.
ఇక, ఇప్పుడు ఈ ఇంటికి అనుబంధంగా నిర్మించిన ప్రజా వేదికను కొనసాగించమని చంద్రబాబు కోరుతున్నారు.ఒక వైపు రాజధానిలో అక్రమాల పైన విచారణ అవసరమని ఒక వైపు చెబుతున్న జగన్ ఇప్పుడు చంద్రబాబుకు ప్రజా వేదిక కొనసాగించటానికి వీలుగా నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి. ఇక జగన్ తీసుకొనే నిర్ణయం పై టీడీపీ అధినేత తో పాటుగా టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
చదవండి: కేశినేని అలకకి కారణం ఇదేనా…!








