హైదరాబాద్ : ఏపీ ప్రభుత్వ ఇంటలిజెన్స్ ప్రధానాధికారిని ఈసీ బదిలీ చేయడం ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి మధ్య ఘర్షణకు కారణమైంది. ఇంటలిజెన్స్ విభాగానికీ ఎన్నికలకూ సంబంధం ఏమిటని సాక్షాత్తూ ముఖ్యమంత్రి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏడు పేజీల లేఖను ఈసీ రాయడాన్ని ఈసీ తప్పుబడుతోంది. ఈమేరకు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖ్యమంత్రి వాదనను చీల్చి చెండాడారు.
పోలీసుల కదలికలు, ఎన్నికల సిబ్బంది తరలింపు, శాంతి భద్రతల నియంత్రణ.. ఇలాంటి వ్యవహారాలన్నీ కచ్చితంగా ఇంటెలిజెన్స్తోనే ముడిపడి ఉంటాయని.. ఏపీ సీఎంకు ద్వివేది గుర్తు చేశారు. వైఎస్.వివేకా హత్య ఉదంతం లో ఇంటెలిజెన్స్ విభాగ సమాచారాన్ని సేకరించాలి కదా… కిడారి హత్యతో ఇంటిలిజెన్స్ కు పని ఉండదా… ఎన్నికల నిర్వహణకు ఇంటెలిజెన్స్తో సంబంధం లేకుండా ఎలా ఉంటుందని ముఖ్యమంత్రిని నేరుగా ప్రశ్నించారు.
ఇంటలిజెన్స్ సహకారం లేకుండా.. సరైన అంచనా., ముందస్తు సమాచారం లేకుండా పోలీసులను ఎలా తరలిస్తారని ద్వివేది అన్నారు. అసలు ఇంటెలిజెన్స్ లేకుండా పోలీస్ వ్యవస్థ ఉంటుందా.. అని నిలదీశారు. ఎన్నికల నిర్వహణలో మొత్తం పోలీస్ వ్యవస్థ ఉండి.. ఇంటెలిజెన్స్కు ఎన్నికలతో సంబంధం లేదంటే ఎలా అని ప్రభుత్వ పెద్దలకు తలంటారు.
అంతేకాదు. ఈ సంద్భంగానే ఈసీకి ఉన్న విశేష అధికారాలను ఆయన గుర్తు చేశారు. భారత ఎన్నికల సంఘం ఓ స్వతంత్ర సంస్థ. ఈసీ నిర్ణయాలపై అభ్యంతరాలుంటే ఎవరైనా కోర్టును ఆశ్రయించొచ్చు, అంటూ ఏపీ ప్రభుత్వానికి ఉచిత సలహా కూడా ఇచ్చేశారు.
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా కేంద్ర ఎన్నికల సంఘం గమనిస్తోందన్న ఆయన.. ఏపీ ప్రభుత్వ వ్యవహార శైలిపై ఎప్పటికప్పుడు సమాచార సేకరణ జరుపుతున్నామన్నారు. పాపం.. ఓ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో అక్షింతలు వేయించుకోవాల్సి పరిస్థితి చంద్రబాబు వంటి చాణక్య ముఖ్యమంత్రికి రావడం విచిత్రమే
చదవండి:భీమవరంలో పవన్ పై పోటీచేయనున్న వర్మ ! ఎలా సాధ్యం!








