హాజీపూర్: ఒంటరిగా వెళ్ళే మైనర్ బాలికలను టార్గెట్గా పెట్టుకుని వరుస అత్యాచారాలు చేసి హతమార్చిన సైకో శ్రీనివాస్ రెడ్డి కథలో సరికొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఇంతమంది అమాయకపు ఆడపిల్లలను పొట్టన పెట్టుకున్న ఆ పాపాత్ముడు ఓ అమ్మాయి విషయంలో మాత్రం కుదురుగానే ఉన్నాడు.
హాజీపూర్లోని అన్నెం పున్నెం ఎరుగని మైనర్ బాలికలపై అఘాయిత్యానికి ఒడిగట్టి వారి ప్రాణాలను మట్టిలో కలిపిన సైకో శ్రీనివాస్ని పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో భాగంగా అతని ఫేస్బుక్ అకౌంట్ చూస్తే అందులో ఒక అమ్మాయితో కలిసి దిగిన ఫోటోలు కనిపించాయి..
చదవండి: వీడొక ‘సైకో’: ముందు ఊపిరాడకుండా చేసి.. ఆపైన హత్యాచారాలు!
ఇంతకీ ఎవరా అమ్మాయి..? ఆ అమ్మాయితో శ్రీనివాస్కి ఉన్న సంబంధం ఏమిటి? అని ఆరా తీసిన పోలీసులకు ఓ కొత్త ట్విస్ట్ ఎదురైంది.
ఆ అమ్మాయి సైకో శ్రీనివాస్ లవర్. గత సంవత్సరన్నర కాలంగా ఆ అమ్మాయితో వీడు ప్రేమాయణం నడుపుతున్నాడు. అందరి విషయంలో తొందరపడి మృగంలా ప్రవర్తించిన శ్రీనివాస్ రెడ్డి ఆ అమ్మాయి విషయంలో మాత్రం మంచిగానే ఉన్నాడు. ఆమెపై ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడలేదని తెలిసి పోలీసులే నిర్ఘాంతపోతున్నారు.
వీడి లవ్ స్టోరీ ఎక్కడ మొదలైందంటే…
సిరిసిల్ల జిల్లా వేములవాడకి చెందిన ఓ అమ్మాయితో శ్రీనివాస్ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయం గురించే శ్రీనివాస్ని ప్రశ్నించగా అతను ఆ అమ్మాయితో ప్రేమలో ఉన్నట్టు తెలిపాడు. అంతే కాదండోయ్ వీరిద్దరూ కలిసి పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నట్టు వెల్లడించాడు.
ఇక వీళ్ళ లవ్ స్టోరీ ఎక్కడ మొదలైందంటే ఇన్ని పాపాలను చేసిన ఈ సైకో గుడికి వెళ్ళి పుణ్యం మూట కట్టుకుందామనుకున్నాడో ఏమో… గుడికి వెళ్ళాడు. అదే గుడికి ఆ యువతి కూడా వచ్చింది. మాటా మాటా కలిశాయి. ఇలాగే కలుస్తూ ఉండటం మొదలు పెట్టారు.
కొంతకాలానికి ఇద్దరి మధ్య ఉన్న పరిచయం కాస్తా పెరిగి ప్రేమగా మారింది. త్వరగా పెళ్లి కావాలని ఇద్దరూ కలిసి గుళ్లలో పూజలు కూడా చేశారట.
ఆ అమ్మాయి విషయంలోనే ఎందుకిలా..?
ఇంత మందిని పొట్టన పెట్టుకున్న సైకో శ్రీనివాస్ రెడ్డి.. ఆ యువతి విషయంలో మాత్రం ఎందుకు సంయమనం పాటించాడు అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు.
ఇప్పటి వరకూ శ్రీనివాస్ రెడ్డి హతమార్చిన వారంతా అతని కోరిక తీర్చడానికి అంగీకరించకపోవడంతో వారిని బెదిరించి లొంగదీసుకుని చంపడం లేదా లొంగకపోతే హతమార్చి కోరిక తీర్చుకోవడం వంటి దారుణాలకు పాల్పడ్డాడు.
ఈ అమ్మాయి దగ్గర మాత్రం అతడు అలా ప్రవర్తించలేదంటే.. బహుశా అతని కోరికలకు ఆమె ఒకే చెప్పిందా..? లేదా తననే పెళ్లి చేసుకుని ఓ జీవితం ప్రారంభించాలని అనుకోవడం వల్లే ఆమెను ఏమీ చెయ్యకుండా ప్రేమగా ఉంటున్నాడా? అనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.
సైకో ఖాతాలో ఫేస్బుక్ అమ్మాయిలు?
సైకో శ్రీనివాస్ రెడ్డి కేసులో కొత్తగా ప్రేమ కథ వెలుగులోకి రావడంతో పోలీసులు వివిధ కోణాలలో విచారిస్తున్నారు. ఈ అమ్మాయి కాకుండా ఇంకెవరైనా ఉన్నారా..? లేక తన ఫేస్బుక్ ఫ్రెండ్స్లో ఎవరినైనా ఇదే విధంగా అతడు హతమార్చిన ఘటనలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీనివాస్ ఫేస్బుక్ అకౌంట్లో 631 మంది స్నేహితులు ఉండగా అందులో దాదాపు 600 మంది అమ్మాయిలే ఉన్నారు. అబ్బాయిలు అంతా కలిపి 50 మంది కూడా లేరు. ఈ నేపథ్యంలోనే ఆ అమ్మాయిలను కూడా కలిసి పరిచయం పెంచుకుని ఏమైనా అఘాయిత్యాలు చేశాడా? అనే అనుమానాలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో వేములవాడ, నిజామాబాద్, కరీంనగర్ చుట్టుపక్కల గ్రామాలలో కనిపించకుండా పోయిన యువతుల గురించి కూడా ఈ కేసు దర్యాప్తు చేస్తోన్న పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఏదేమైనా ఈ సైకో శ్రీనివాస్ రెడ్డి వల్ల అభంశుభం తెలియని ఆడపిల్లలు అన్యాయమై పోయారు. శ్రావణి మృతదేహం బయటపడటం వల్లే ముందు జరిగిన రెండు అత్యాచారాలు కూడా వెలుగులోకి వచ్చాయి. మరి వెలుగులోకి రాకుండా చీకటిలోనే మగ్గిపోయిన ఘటనలెన్ని?.. వాడి ఖాతాలో ఇంకెంతమంది అమాయకపు ఆడపిల్లలు బలిపశువులు అయి ఉంటారు? ఈ కేసులో విచారణ మరింత లోతుగా జరిగితేగాని ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకవు.