హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వంపై విపక్షాలతో పాటు విద్యార్థి సంఘాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇంటర్ ఫలితాలు వెలువడినప్పటి నుంచి మొదలైన ఆందోళనలు నేటికీ ఆగడం లేదు. ఇప్పటికే 20 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంతో ఈ ఆందోళన మరింత ఉగ్రరూపం దాల్చింది.
నేడు విపక్షాలు గవర్నర్ నరసింహన్ను కలిసి ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ వైఫల్యంపై ఫిర్యాదు చేశాయి. అలాగే కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ విజయశాంతి కూడా ఇంటర్ విద్యార్థుల తరపున ప్రభుత్వం పై నిరసన వ్యక్తం చేసింది. ఇకపోతే కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటర్ పరీక్షలే సరిగా నిర్వహించలేని కేసీఆర్ దేశాన్ని ఉద్దరిస్తాడా అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
సర్పంచ్లకు చెక్ పవర్ ఇవ్వకుండా గ్రామాల్లో సమస్యలను గాలికి వదిలేశారన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించడంపైనే కేసీఆర్ దృష్టంగా ఉందని కోమటిరెడ్డి విమర్శించారు. అలాగే విద్యాశాఖ మంత్రిని కేబినెట్ నుండి భర్తరఫ్ చేయాలనీ , విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నాయి.