- Advertisement -
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ను త్వరితగతిని ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ ఎంపీలు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కోరారు. ఈ మేరకు బుధవారం రాష్ట్రపతి కలిసిన ఎంపీలు ఆయనకు ఒక వినతి పత్రాన్ని అందజేశారు. కేంద్ర మాజీ పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు సారథ్యంలోని టీడీపీ ప్రతినిధి బృందం రాష్ట్రపతి భవన్లో రామ్నాథ్ కోవింద్ను కలుసుకుంది.
కడపలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరుతూ టీడీపీ ఎంపీ సీఎం రమేష్ కడపలో ఇటీవల 10 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అంశపైం ఏపీ ప్రభుత్వం, కేంద్రం కొద్ది నెలలుగా సిగపట్లు పట్టుకుంటున్నాయి.
2014 ఏపీ రికగ్నైజేషన్ చట్టం (తెలంగాణ యాక్ట్)లో హామీ ఇచ్చిన విధంగా స్టీల్ ప్లాంట్ కడపలో ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తుండగా, ఆ ప్రతిపాదనను కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో తోసిపుచ్చింది. ఈ ప్రాజెక్టు ఆర్థికంగా ఏమాత్రం కలిసిరాదని పేర్కొంటూ కేంద్రం ఈ నిర్ణయాన్ని ఇటీవల ఉపసంహరించుకుంది.
అయితే కేంద్రం వాదనను ఏపీ ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ఇది కనీసం 15 ఏళ్లయినా వెనక్కి తిరిగిచూసుకోవాల్సిన అవసరం లేని ప్రాజెక్టు అంటూ కుండబద్ధలు కొట్టింది. బుధవారం కడప స్టీల్ ప్లాంట్ విషయమై టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కూడిన ప్రతినిధి బృందం రాష్ట్రపతిని కలిసినట్టు ఆ తరువాత రాష్ట్రపతి కార్యాలయం ఓ ట్వీట్లో పేర్కొంది.
- Advertisement -