మీ కుటుంబాలే రాజకీయాలు చేయాలా?: నారా, వైఎస్ జగన్‌పై పవన్ కళ్యాణ్ ఫైర్

- Advertisement -

నెల్లూరు: తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలే లక్ష్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. కుటుంబాల మధ్య రాజకీయాలు నలిగిపోతున్నాయని ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన నెల్లూరు జిల్లా కోవూరులో జరిగిన ఎన్నికల ప్రచార రోడ్ షోలో పాల్గొని ప్రసంగించారు.

రాష్ట్రంలో యువత మార్పు కోరుకుంటోందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. రాజకీయాలంటే రెండు పార్టీలు, నారా, జగన్‌ కుటుంబాలే చేయాలా? ఇంకెవరూ చేయొద్దా? అని పవన్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆ పరిస్థితిని మార్చేందుకే ఈ ఎన్నికల నుంచి తాము శ్రీకారం చుట్టామని అన్నారు.

రాజకీయాలను మార్చేస్తా..

వైసీపీ నేతలు స్వార్థ రాజకీయాలు మానుకోవాలని సూచించారు. పోలీసులపై నమ్మకం లేదంటూ వారిని అవమాన పరుస్తున్నారని విమర్శించారు. పోలీసులపై ఇకనైనా విమర్శలు మానాలని గట్టిగా చెబుతున్నానన్నారు. జనసేన అధికారంలోకి వస్తే ఏడాదికి 6 నుంచి 10 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తానన్నారు.

తాను నెల్లూరులోనూ నివసించానని చెప్పిన పవన్.. కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో పెరిగానని అన్నారు. ఇక్కడి రాజకీయాలు మార్చాలనుకుంటున్నట్టు చెప్పారు. అందుకు ప్రజల ఆశీస్సులు కావాలన్నారు. మాట్లాడితే బీసీలు అంటూ బీసీ సభలు పెడుతున్నారని, ఎంతమంది బీసీలకు అండగా నిలబడ్డారో జగన్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

చదవండి: అందుకే మహేశ్ బాబుపై ఐటీ దాడులు: గల్లా సంచలనం
- Advertisement -