కర్నూల్: ప్రయాణికులతో వెళుతున్న ట్రావెల్ బస్సులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన కర్నూలు జిల్లా ప్యాపిలి మండల పరిధిలో జాతీయ రహదారిపై గురువారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. ఎల్లో ట్రావెల్స్కి చెందిన బస్సు 20 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తోంది.
కర్నూల్ ప్యాపిలి మండలం ఏనుగుమర్రి సమీపంలోకి రాగానే బస్సు వెనుక సీట్లలో కూర్చున్న ప్రయాణికులకు ప్లాస్టిక్ వస్తువులు కాలిన వాసన రావడంతో అనుమానం వచ్చి డ్రైవర్కు చెప్పారు. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన ఆపడంతో ప్రయాణికులంతా కిందకు దిగారు.
క్షణాల్లోనే బస్సు మొత్తం మంటలు వ్యాపించి, బస్సుతో పాటు అందులో ఉన్న సామగ్రి మొత్తం కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ హాని జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఘటనాస్థలికి పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ప్యాపిలి సీఐ ములకన్న తెలిపారు.