చిత్తూరు జిల్లాలో విషాదం: కారులో మంటలు.. టీటీడీ ఉద్యోగి కుటుంబం సజీవ దహనం

- Advertisement -

చిత్తూరు: జిల్లాలోని మామడుగు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో కారులో మంటలు చెలరేగి ఐదుగురు సజీవదహనమయ్యారు.

మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు జాహ్నవి, కళ,భానుతేజ, సాయి అశ్రిత, పవన్‌రామ్‌గా గుర్తించారు.

టీటీడీ ఉద్యోగి విష్ణు.. భార్యా పిల్లలు బంధువులతో కలిసి తిరుమల వెళ్లారు. అనంతరం తిరిగి బెంగళూరుకు వెళ్తుండగా గంగవరం మండలం మామడుగు జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి బోల్తా పడింది.

ఆ వెంటనే కారులో మంటలు చెలరేగడంతో వారు తప్పించుకునే అవకాశం లేకుండాపోయింది. మంటలకు ఐదుగురు సజీవంగా దహనమైపోయారు.

ఈ ప్రమాదంలో విష్ణు తీవ్ర గాయాలతో తప్పించుకోగా, భార్య జాహ్నవి, కుమారుడు పవన్ రామ్, కుమార్తె అశ్రిత, సోదరి కళ, సోదరి కుమారుడు భానుతేజ మృతి చెందారు. మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయి.

కారులో మంటలు రావటంతో భయపడిపోయిన విష్ణు మాత్రం కారునుంచి దూకేయటంతో గాయాలు కాగా ప్రాణాలతో బైటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి విష్ణును పలమనేరు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -