విషాదం: సహచరులపై జవాను కాల్పులు, ముగ్గురు మృతి

Jammu and Kashmir Latest Updates News, CRPF jawan Latest News, Newsxpressonline
- Advertisement -

శ్రీనగర్: ఓ సీఆర్పీఎఫ్ జవాను ఘాతుకానికి తెగబడ్డాడు. తన తన సహచరులపై కాల్పులు జరిపి ముగ్గురి ప్రాణాలు పొట్టనపెట్టుకున్నాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం రాత్రి జమ్మూకాశ్మీర్‌లోని ఉధమ్‌పూర్ క్యాంపులో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. ఉధంపూర్ 187వ బెటాలియన్‌కు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ అజిత్ కుమార్ తన సహచరులతో గొడవపడినట్టు కమాండర్ హరీందర్ కుమార్ వెల్లడించారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన అతడు తన రివాల్వర్‌తో ముగ్గురిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడని తెలిపారు.

గొడవపడి కాల్పులు..

ఈ ఘటనలో రాజస్థాన్‌కు చెందిన పొకారమల్, ఢిల్లీకి చెందిన యోగేంద్ర, హర్యానాకు చెందిన ఉమెద్‌ సింగ్‌లు చనిపోయినట్టు చెప్పారు. రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని వివరించారు. కాల్పుల శబ్ధం గ్రహించిన తోటి జవాన్‌లు అక్కడికి చేరుకొని గాయాలతో ఉన్నవారిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే పొకారమల్, యోగేంద్ర, ఉమెద్‌లు చనిపోయినట్టు వైద్యులు నిర్ధరించారు.

ప్రస్తుతం అజిత్ ఆరోగ్య పరిస్థతి విషమంగా ఉన్నట్లు తెలియజేశారు. అజిత్ స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌. కాల్పులకు పాల్పడిన అజిత్ మానసిక పరిస్థితి సక్రమంగా లేదని, వ్యక్తిగత కారణాలతోనే ఈ దారుణానికి పాల్పడినట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

 

- Advertisement -