తెలంగాణలో టీడీపీకి మరో భారీ షాక్.. పార్టీకి దేవేందర్ గౌడ్ గుడ్‌బై?

- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో టీడీపీ మరో భారీ షాక్ తగలనుంది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు టి.దేవేందర్ గౌడ్ త్వరలో బీజేపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనారోగ్య సమస్యల కారణంగా గత కొన్నిరోజులుగా ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు.

కేన్సర్ వ్యాధితో బాధపడిన ఆయన అమెరికాలో శస్త్రచికిత్స చేయించుకుని ప్రస్తుతం కోలుకుంటున్నారు. అనారోగ్యం కారణంగానే తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారంలో గానీ, సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో గానీ పాల్గొనలేదు.

ఆయన తనయుడు వీరేందర్ గౌడ్ కూడా టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. తండ్రి దేవేందర్ గౌడ్‌తో కలిసి బీజేపీలో చేరతారంటూ సమాచారం. వీరేందర్ గౌడ్ తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు.

బీజేపీ జాతీయ నాయకత్వం ఇప్పటికే దేవేందర్ గౌడ్‌తో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. రాష్ట్ర నాయకత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. టీడీపీలో దేవేందర్ గౌడ్ నెంబర్ 2 స్థానంలో ఉండేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కీలకమైన హోంశాఖ మంత్రిగా వ్యవహరించారు. చంద్రబాబుకు అత్యంత ఆప్తుడుగా మెలిగారు. అమెరికాలో చికిత్సపొందుతున్నప్పుడు చంద్రబాబు సైతం ఆయనను కలిశారు.

అయితే తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ లేకపోవడం, క్యాడర్ సైతం బీజేపీలోకి వెళ్లాలంటూ ఒత్తిడి పెంచుతుండటంతో తనయుడు వీరేందర్ గౌడ్‌తో కలిసి బీజేపీలో చేరబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, తాము పార్టీని వీడుతున్నామంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని వీరేందర్ గౌడ్ తేల్చి చెప్పారు.

- Advertisement -