హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం గాంధీభవన్లో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఆర్సీ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డిలు నేతృత్వం వహించారు. ఈ సమావేశానికి పీసీసీ ఆఫీస్ బేరర్స్, డీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర అనుబంధ సంఘల ప్రతినిధులు, ఆయా విభాగాలకు సంబంధించిన నేతలు, ఏఐసీసీ కార్యదర్శులు హాజరయ్యారు.
వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం గురించి, ఈవీఎంల పరిశీలన మరియు ఎన్నికల నిబంధనల ఉల్లంఘన పైన, పొత్తుల వ్యవహారాలు మొదలైన వాటిపై ఈ సమావేశంలో చర్చించినట్టు సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్ఠాయిలో అనుసరించాల్సిన అంశాలపై సమాలోచనలు జరిపినట్టు తెలుసోంది.
మహాకూటమి ఏర్పాటులో భాగంగా సీట్ల సర్దుబాటులో టిక్కెట్ రాకపోయినా… పార్టీ కోసం అందరూ కలిసి కట్టుగా పని చేయాలని పార్టీ నేతలకు అగ్ర నాయకులు ఉద్బోధించినట్టు సమాచారం. ఈ భేటీలో చర్చించిన అంశాలను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి మీడియాకు వెల్లడించనున్నారు.
రేపు మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా గ్రామ స్థాయి నుండి మండల, జిల్లా స్థాయి వరకు గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించాలని, కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలనే అంశం పై కూడా చర్చించినట్లు సమాచారం.