న్యూఢిల్లీ : తెలంగాణలో అధికారంలోకి రావడమే ప్రధాన లక్ష్యంగా.. కాంగ్రెస్ పార్టీ టీడీపీతో సహా పలు స్థానిక పార్టీలతో పొత్తుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే సీట్ల సర్దుబాటు విషయంలో ‘మహాకూటమి’లో సయోధ్య చెడిందంటూ పలు కథనాలు వెలువడుతున్నాయి.
ఈ విషయమై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి ఆర్సీ కుంతియా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యాలు చేశారు. ‘‘మహాకూటమి ఉమ్మడి ఏకైక లక్ష్యమైన కేసీఆర్ ఓటమికై కాంగ్రెస్ పార్టీ సీట్ల త్యాగానికి కూడా సిద్ధమే, తెలంగాణలో టీఆర్ఎస్ను ఓడించేందుకు మిగతా పార్టీలన్నీ కలిసి రావాలి..’’ అంటూ ఆయన పిలుపునిచ్చారు.
అంతేకాదు, సామాజిక వర్గాలు, గెలిచే అభ్యర్థుల ప్రతిపాదికగా సీట్ల కేటాయింపు అంశమై చర్చలు జరుపుతున్నామని కుంతియా పేర్కొన్నారు. మహాకూటమి సీట్ల సర్దుబాటు విషయం త్వరగా ఒక కొలిక్కి రావాలని తాను ఆకాంక్షిస్తున్నానన్నారు.
తెలంగాణలోని మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేస్తారని కుంతియా స్పష్టం చేశారు. బీసీలకు కేసీఆర్ ఇచ్చిన సీట్ల కంటే ఎక్కువ సీట్లే కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఒక్కో నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి 15 మంది ఆశావహులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు.