హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను ప్రధాన పార్టీలు చాలా వరకు ఖరారు చేశాయి. నామినేషన్ల దాఖలుకు సోమవారమే ఆఖరి రోజు కావడంతో ఆయా పార్టీలు అక్కడక్కడా మిగిలిన స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి.
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 119 నియోజకవర్గాలు ఉండగా అధికార పార్టీ టీఆర్ఎస్ 119 స్థానాల్లో తన అభ్యర్థులను పోటీ చేయిస్తోంది. ఇప్పటి వరకు 117 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్ ఆదివారం సాయంత్రం మిగిలిన రెండు నియోజకవర్గాలకూ అభ్యర్థులను ప్రకటించేసింది. కోదాడ స్థానంలో బొల్లం మల్లయ్య యాదవ్ను, ముషీరాబాద్ స్థానంలో ముఠా గోపాల్ను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు.
ఇక ‘మహాకూటమి’గా ఈసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జనసమితి… ఇప్పటి వరకు 108 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. ఇందులో కాంగ్రెస్ నుంచి 88 మంది, తెదేపా నుంచి 13 మంది, తెలంగాణ జనసమితి నలుగురు, సీపీఐ ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ ఆరు స్థానాలకు, తెదేపా ఒక స్థానానికి, తెలంగాణ జనసమితి నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.
మరోవైపు భారతీయ జనతా పార్టీ మొత్తం 119 స్థానాలకుగాను ఇప్పటికే 93 స్థానాలకు తన అభ్యర్థులను ప్రకటించగా, బహుజన లెఫ్ట్ఫ్రంట్ 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే విషయంలో బీజేపీ కూడా త్వరపడుతోంది. మరోవైపు బీజేపీ.. యువ తెలంగాణ పార్టీతో జట్టు కట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత జిట్టా బాలకృష్ణారెడ్డికి భువనగిరి నియోజకవర్గ టిక్కెట్టును ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి సోమవారం నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో కనీసం ఆదివారమైనా బీజేపీ టిక్కెట్లు కన్ఫర్మ్ చేస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.
ఇక ఎంఐఎం పార్టీ హైదరాబాద్లో గతంలో ప్రాతినిధ్యం వహించిన ఏడు స్థానాలతోపాటు ఈసారి అదనంగా మరో స్థానంలో పోటీ చేస్తోంది. మలక్పేట నుంచి మహ్మద్ అబ్దుల్ బలాలా, నాంపల్లి నుంచి జాఫర్ మిరాజ్, కార్వాన్ స్థానంలో మహ్మద్ కౌసర్, చార్మినార్ నుంచి ముంతాజ్ఖాన్, యాఖుత్పురా నుంచి అహ్మద్పాషా ఖాద్రీ, చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో అసదుద్దీన్ ఒవైసీ, బహదూర్పుర నుంచి మౌజాంఖాన్ పోటీ చేస్తుండగా రాజేంద్రనగర్ స్థానంలో మిర్జా రహ్మత్భేగ్ బరిలో నిలిచారు.