శ్రీకాకుళం: తెలంగాణ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్పై ఏపీ మంత్రి నారా లోకేష్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. అభ్యర్థులకు కేటీఆర్ ఫోన్ చేసి బెదిరిస్తున్నారని.. నామినేషన్ ఉపసంహరించుకోకపోతే భూములు లాక్కుంటామని హెచ్చరిస్తున్నారని లోకేశ్ ఆరోపించారు.
శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురంలో లోకేశ్ రోడ్డు షో నిర్వహించారు. ఈ రోడ్డు షోలో శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి గౌతు శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. బలహీన ముఖ్యమంత్రి ఏపీలో అధికారంలో ఉంటే పోలవరం ప్రాజెక్టు ఆపేయొచ్చని, ముంపు మండలాలు వెనక్కి తీసుకోవచ్చని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
బందరు పోర్టుపై తెలంగాణ సర్కారు కన్నేసింది..
‘మన బందరు పోర్టును తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ పోర్టులో తెలంగాణ వారికి ఉద్యోగాలు కల్పించాలని చూస్తున్నారు. ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. కేసీఆర్తో కలిసిన జగన్ను వాళ్ల కార్యకర్తలు నిలదీయాల్సి ఉంది. కేసీఆర్తో పొత్తు పెట్టుకుంటే ఏమైందని జగన్ వ్యాఖ్యానించారు. మనం ఎలా ఊరుకుంటాం’ అని లోకేష్ వ్యాఖ్యానించారు.
అంతేగాక, ‘ఈ ఎన్నికల్లో వైకాపాకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. పసుపు-కుంకుమ అందించిన వ్యక్తిని గెలిపిద్దామా? పసుపు-కుంకుమ చెరిపేసిన వ్యక్తిని గెలిపిద్దామా? చంద్రన్న పెళ్లి కానుక, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వంటి దాదాపు 120 సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టాం. 2014కు ముందు ఎండాకాలం వస్తే భయపడేవారు. కరెంటు ఎప్పుడు పోతుందో అని. ఇప్పుడు 24 గంటల విద్యుత్ అందిస్తున్నాం’ అని లోకేశ్ అన్నారు.
అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ‘టీడీపీ గెలవాల్సిన అవసరం ఎంతో ఉంది. గౌతు లచ్చన్న నడయాడిన మండలం ఇది. ఇదే ఉద్యమ స్ఫూర్తితో పని చేయండి. మనకు క్యారెక్టర్ ఉన్న ముఖ్యమంత్రి కావాలి. క్రిమినల్ మైండ్తో ఉన్న సీఎం వద్దనేది మీరంతా చాటి చెప్పండి’ అని అన్నారు.
చదవండి:కర్నూలు పార్లమెంట్ బరిలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పేదల డాక్టర్ సంజీవ్ కుమార్