సిద్దిపేట: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఉదయం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని కోనాయిపల్లికి చేరుకున్నారు. 11:50 గంటల ప్రాంతంలో అక్కడి వేంకటేశ్వర స్వామి ఆలయంలో తన నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
1985 నుండి కోనాయిపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం కేసీఆర్కు సెంటిమెంట్గా వస్తోంది. ఎక్కడి నుండి పోటీ చేసినా కూడా కేసీఆర్ నామినేషన్ పత్రాల దాఖలుకు ముందు ఈ ఆలయానికి వచ్చి.. వెంకన్న సన్నిధిలో తన నామినేషన్ పత్రాలను ఉంచి ప్రత్యేకంగా పూజలు చేస్తు వస్తున్నారు.
బుధవారం ఉదయం కూడా ప్రత్యేక హెలికాప్టర్లో కోనాయిపల్లికి చేరుకున్న కేసీఆర్.. వేంకటేశ్వర స్వామి సన్నిధిలో తన నామినేషన్ పత్రాలను ఉంచి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. మంత్రి హరీశ్రావుతో కలిసి కోనాయిపల్లి చేరుకున్న సీఎం కేసీఆర్కు గ్రామస్థులు పెద్దఎత్తున స్వాగతం పలికారు.
మీ మధ్యే పెరిగా.. మీ దీవెనలతో మళ్లీ యుద్ధానికి పోతున్నా…
పూజా కార్యక్రమాల అనంతరం సీఎం మాట్లాడుతూ.. ‘‘ఢిల్లీకి రాజైనా.. తల్లికి కొడుకునే.. మీ మధ్యే పెరిగా’’.. ఇక్కడ పూజలు చేసే ఉద్యమానికి బయల్దేరాను. మీ దీవెనలతో ఇప్పుడు మళ్లీ యుద్ధానికి పోతున్నా.. వంద సీట్లతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంటాం..’’ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించగా గ్రామస్థులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారు.
హరీశ్రావును ఆశీర్వదించండి…
దేశంలో 24 గంటల విద్యుత్ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ అని, రైతుల నెత్తిన అప్పు లేని తెలంగాణే బంగారు తెలంగాణ అని అన్నారు. తెలంగాణ రైతుల ఆదాయం పెరగాలని, దేశంలోనే ధనిక రైతులకు తెలంగాణ వేదిక కావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. రెండేళ్లలో సిద్దిపేటలో రైలు కూత వినిపిస్తదని, వచ్చే ఏడాది కాళేశ్వరం నీళ్లతో దేవుడి పాదాలు కడుగుతామని, సిద్దిపేటలో హరీశ్రావును ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు.
నామినేషన్ వేసిన కేసీఆర్…
అనంతరం కోనాయిపల్లి నుంచి గజ్వేల్ చేరుకున్న సీఎం కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తన నామినేషన్ దాఖలు చేశారు. గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలో కేసీఆర్ తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. అనుకున్న సమయానికి.. ముహుర్తం ప్రకారం మధ్యాహ్నం 2.34 గంటలకు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా కొద్దిమంది అనుచరులతో కలిసి వచ్చిన సీఎం తన నామినేషన్ను అందజేశారు.