పాస్ పోర్ట్ నిబంధనలు మారాయి. కొత్త నిబంధనలు జూన్ 1 నుంచే అమలులోకి వచ్చాయి. అవును, 2018 సంవత్సరానికి కొత్త పాస్ పోర్ట్ రూల్స్ తో ముందుకొచ్చింది విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. జూన్ 2018 నుంచి ఈ కొత్త పాస్ పోర్ట్ రూల్స్ అమలులోకి వచ్చాయి. ఇందుకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదల అయ్యాయి.
మారిన నిబంధనల ప్రకారం… పాస్ పోర్ట్ చివరి పేజీలో మీ నివాస సమాచారం ఉండదు. పాస్ పోర్ట్ కలర్ మారనుంది. ఇప్పటివరకూ వివిధ కేటగిరీలకు జారీ చేసే పాస్ పోర్టులు వివిధ రంగుల్లో ఉండేవి. అయితే ఇక నుంచి ఒకే రంగులో పాస్ పోర్ట్ జారీ చేయనున్నారు. అంతేకాదు, ఇకమీదట పాస్ పోర్ట్ చివరి పేజీలో తల్లిదండ్రుల పేర్లు కూడా ఉండవు.
ఇప్పటివరకు దేశంలో మూడు రంగుల్లో పాస్పోర్ట్లు జారీ చేస్తున్నారు. దౌత్యాధికారులకు ఎరుపు రంగులో, ప్రభుత్వ అధికారులకు తెలుపు రంగులో పాస్పోర్ట్లు జారీ చేస్తుండగా, సాధారణ పౌరులకు నీలి రంగులో పాస్పోర్ట్ ఇస్తున్నారు. ఇందులోనూ మళ్లీ ఇమ్మిగ్రేషన్ రిక్వైర్డ్, ఇమ్మిగ్రేషన్ నాట్ రిక్వైర్డ్ అంటూ రెండు రకాలున్నాయి. తాజా నిబంధనల ప్రకారం.. ఇమ్మిగ్రేషన్ రిక్వైర్డ్ కేటగిరీ పాస్పోర్ట్ను ఆరెంజ్ రంగులో జారీ చేయనున్నారు.
ఇక 2012 నుంచీ జారీ చేయబడిన పాస్ పోర్ట్ల అన్నింటిలో బార్ కోడ్ పొందుపరిచారు. ఈ బార్ కోడ్ను స్కాన్ చేయగానే ఆ పాస్పోర్ట్ కలిగిన వ్యక్తి వివరాలు తెలిసిపోయేవి. అయితే ఇప్పటి వరకు జారీ అయిన పాస్పోర్ట్లన్నీ వాటి వ్యాలిడిటీ అయిపోయేంత వరకు అమలులో ఉంటాయి. వాటిని ఇచ్చేసి కొత్త పాస్పోర్ట్ తీసుకోవలసిన అవసరం లేదు.