
ఢిల్లీ: భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ వద్ద జరుగుతున్న కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మోడీ చేత ప్రమాణస్వీకారం చేయించారు.
నరేంద్ర దామోదర్ దాస్ అను నేను అంటూ మోడీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. మోడీ ప్రమాణ పత్రం చదువుతున్న సమయంలో బోలో భారత్ మాతాకీ జై అంటూ నినాదాలతో రాష్ట్రపతి భవన్ పరిసరాలు మార్మోగిపోయాయి.
ఇక మోడీతో పాటు 50 మంది కేబినెట్ మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే రాజనాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, సదానంద గౌడ, నిర్మలా సీతారామన్, రామ్ విలాస్ పాశ్వాన్ లు మంత్రులుగా ప్రమాణం చేశారు.
ఇక మోడీ ప్రమాణస్వీకారం సందర్భంగా దేశవిదేశీ అతిథు రాకతో రాష్ట్రపతి భవన్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. రాజకీయ, పారిశ్రామిక, సినీ, క్రీడా దిగ్గజాలతో పాటు దేశ విదేశాలకు చెందిన అతిరథ మహారథులు మోడీ ప్రమాణస్వీకార మహోత్సవాన్ని వీక్షించేందుకు రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు. దాదాపు 8వేల మంది అతిథులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు.
కాగా, మోడీ మంత్రివర్గంలో మాజీ విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్, మాజీ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి చోటు కల్పించలేదు. కేంద్రమంత్రి జేపీ నడ్డాను కేబినెట్కు దూరంగా ఉంచారు. ఆయనకు పార్టీ పగ్గాలు అప్పజెప్పే అవకాశముంది.








