డీఎంకే చీఫ్ కరుణానిధి కన్నుమూత.. తమిళనాడు అంతటా విషాదం

karunanidhi
- Advertisement -

karunanidhi-body

డీఎంకే కురువృద్ధుడు కరుణానిధి భౌతిక కాయాన్ని కావేరి ఆసుపత్రి నుంచి గోపాలపురం నివాసానికి తరలిస్తున్న దృశ్యం


చెన్నై: ద్రావిడ మున్నేట్ర కజగం (డీఎంకే) నేత.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఇకలేరు. ఆయన మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయనకు చికిత్స అందిస్తోన్న కావేరీ ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.  94 ఏళ్లు పూర్తయిన కరుణానిధి కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.

కరుణానిధి మరణ వార్త ప్రకటించడానికి ముందు తమిళనాడు రాష్ర్ట వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. చెన్నైలోని కావేరీ ఆసుపత్రి వద్ద భద్రతాబలగాలను పెద్దఎత్తున మోహరించారు.  ముత్తువేల్ కరుణానిధి 1924 జూన్ 3వ తేదీన తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు.

అళగిరిసామి ప్రసంగాలకు ఆకర్షితుడై…

జస్టిస్ పార్టీ నాయకుల్లో ఒకరైన అళగిరిసామి ప్రసంగాలకు ఆకర్షితుడై రాజకీయాల వైపు మళ్లారు. డీఎంకే వ్యవస్థాపకులు అన్నాదురై మరణానంతరం.. 1969లో కరుణానిధి మొదటిసారి తమిళనాడుకు ముఖ్యమంత్రి అయ్యారు. మరణించే సమయానికి.. తిరువవూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి కరుణానిధి ఎమ్మెల్యేగా ఉన్నారు.

రెండేళ్లుగా క్రియాశీలక రాజకీయాలకు దూరం…

రెండేళ్లుగా ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. ఆయన కుమారుడు, రాజకీయ వారసుడు అయిన స్టాలిన్.. 2017లో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు.  కొన్ని రోజులుగా కరుణానిధి ఆరోగ్యం క్షీణించింది. ఆయన నివాసంలోనే వైద్యులు చికిత్స అందించారు. ఆ తర్వాత చెన్నైలోని కావేరీ హాస్పిటల్‌కు కరుణను తరలించి, ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు.

‘భారతదేశ స్వాతంత్ర్యానికి ముందు రాజకీయ జీవితం ప్రారంభించిన నాయకుల్లో అతికొద్ది మంది మాత్రమే ఇప్పుడు జీవించి ఉన్నారు. కొన్ని క్షణాల క్రితం వరకూ కరుణ కూడా వారిలో ఒకరు. ఆ విధంగా చూస్తే ఆయన మరణం ఒక శకానికి ముగింపు వంటిది..’ అని బీబీసీ తమిళ ప్రతినిధి మురళీధరన్ కాశీవిశ్వనాథన్ అభిప్రాయపడ్డారు.  కరుణానిధి ఐదుసార్లు తమిళనాడు రాష్ట్ర ముఖ్యముంత్రిగా పని చేశారని, ఆరు దశాబ్దాలకు పైగా శాసనసభ్యుడిగా ఉన్నారని, వ్యక్తిగతంగా ఎన్నడూ ఓటమి చవిచూడలేదని మురళీధరన్ చెప్పారు.

karuna-stalinకరుణానిధికి సంబంధించిన అరుదైన విషయాలు…

భారతదేశ స్వాతంత్ర్యానికి ముందు రాజకీయ జీవితం ప్రారంభించిన నాయకుల్లో కరుణ ఒకరు.  ఎన్నికల్లో వ్యక్తిగతంగా ఓటమి ఎరుగని నాయకుడు కరుణానిధి. సీఎంలకు పంద్రాగస్టున జెండా ఎగురేసే హక్కు కరుణ వల్లే దక్కింది.

ఆయనకు చిన్నప్పటి నుంచే రచనలపై ఆసక్తి పెరిగింది. కరుణానిధి 2 లక్షలకు పైగా పేజీలు రాశారు. ఆయన తన పార్టీ అధికారిక పత్రిక ‘మురసోలి’లో రాస్తున్న ‘ఉదాన్‌పిరప్పి’ (ఓ సోదరుడా…) లేఖల సీరియల్.. ప్రపంచంలో న్యూస్‌పేపర్ సీరియళ్లలో అతి సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న సీరియల్.

కరుణానిధి 1947 నుంచి 2011 వరకూ దాదాపు 64 సంవత్సరాల పాటు సినిమాలకు సంభాషణలు రాశారు.

- Advertisement -