ముంబై: దసరా సందర్భంగా రావణ దహనాన్ని నిషేధించాలని దళిత హక్కుల సంస్థ ‘భీమ్ ఆర్మీ’ డిమాండ్ చేసింది. రావణాసురుడి దిష్టిబొమ్మల దహనాన్ని నిషేధించాలని, దహనానికి పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని పూణే పోలీసులను లిఖిత పూర్వకంగా కోరింది.
రావణుడు మానవతా సంస్కృతికి చిహ్నమని, అందుకే పలు ఆదివాసీ వర్గాలకు రావణుడు పూజ్యనీయుడని భీమ్ ఆర్మీ పేర్కొంది. రావణుడు న్యాయం, సమానత్వం పట్ల విశ్వాసం కలిగిన రాజు అని కొనియాడింది. ఎన్నో సంవత్సరాలుగా రావణుడి చరిత్రను వక్రీకరిస్తూ వస్తున్నారని పేర్కొంది.
రావణుడిని చాలా దుర్మార్గుడిగా చూపిస్తున్నారని పోలీసులకు ఇచ్చిన లేఖలో భీమ్ ఆర్మీ పేర్కొంది. అంతేకాదు, ఒకవేళ రావణ దహనంపై నిషేధం విధించడంలో పోలీసులు విఫలమైతే శాంతి భద్రతల సమస్య కూడా తలెత్తుతుందంటూ ఆ సంస్థ హెచ్చరించింది. భీమ్ ఆర్మీతో పాటు మహారాష్ట్రలోని ఇతర ఆదివాసీ సంస్థలు కూడా ఈ రావణ దహనాన్ని వ్యతిరేకిస్తున్నాయి.