ఢిల్లీ: ఏడు దశల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఆదివారం సాయంత్రంతో ముగిశాయి. ఇక ఎన్నికల ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు పోటెత్తాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్లో బీజేపీ హయాంలోనే ఎన్డీయే హవా స్పష్టంగా కనిపిస్తోంది.
మొత్తం ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి స్పష్టమైన అధికారాన్ని కట్టబెట్టాయి. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మొత్తం 542 సీట్లకి గాను ఏ పార్టీకైనా.. కూటమికైనా 272 సీట్లు రావాలి. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 282 స్థానాలు సాధించగా.. ఎన్డీయే కూటమికి 336 సీట్లు వచ్చాయి.
చదవండి: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు: ఏపీలో వైసీపీ జోరుకి బ్రేకులు లేవు!
అయితే ఈ సారి కూడా 2014 ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయని ఎగ్జిట్ పోల్ సంస్థలు అంచనా వేయడం విశేషం. గత ఎన్నికల్లో వాస్తవానికి దగ్గరగా ఫలితాలు ఇచ్చిన టుడేస్ చాణక్య ఈసారి కూడా ఎన్డీయేకు 336-364 రావోచ్చని అంచనా వేసింది.
ఇండియా టుడే (ఆజ్ తక్ యాక్సిస్ మై ఇండియా) కూడా ఎన్డీయేకు 339 నుంచి 365 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ‘నేత- న్యూస్ ఎక్స్’ సంస్థ ఎన్డీయేకు 242 సీట్లు మాత్రమే వస్తాయని, యూపీఏ 164 స్థానాలు సాధిస్తాయని పేర్కొంటే.. ఏబీపీ నీల్సన్ ఎన్డీయేకు 267; యూపీఏకు 130 సీట్లు వస్తాయని తెలిపింది.
మిగిలిన తటస్థ పార్టీలన్నిటికీ కలిపినా 150 సీట్లు దాటవని అత్యధిక సర్వే సంస్థలు అంచనా వేశాయి. టైమ్స్ నౌ-వీఎంఆర్ సర్వేలో బీజేపీకి 306 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 132, ఇతరులు 104 స్థానాల్లో విజయం సాధిస్తారని అంచనా వేశారు. న్యూస్ నేషన్ సర్వేలో సైతం ఇవే ఫలితాలు కనిపిస్తున్నాయి. బీజేపీకి 282 నుంచి 290 సీట్లు, కాంగ్రెస్ కు 118 నుంచి 126 సీట్లు, ఇతరులకు 130 నుంచి 138 సీట్లు వస్తాయని అంచనా వేశారు.