శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లా లాసీపొర ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య సోమవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు.
లాసీపొర ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో సీఆర్పీఎఫ్ జవాన్లు, కాశ్మీర్ సాయుధ పోలీసులు నిర్భంద తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ముష్కరులు జవాన్లపై కాల్పులు ప్రారంభించారు.
అ క్రమంలో ఎదురు కాల్పులు జరిపిన సిబ్బంది నలుగురు ఉగ్రవాదులను హతమర్చారు. ఈ సంఘటనా స్థలిలో రెండు ఏకే రైఫిల్స్, ఒక ఎస్ఎల్ఆర్, ఒక తుపాకీని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
కాగా, ఈ ఎదురుకాల్పుల ఘటనలో ముగ్గురు భద్రతాధికారులు గాయాలపాలయ్యారు. గత ఫిబ్రవరిలో పుల్వామాలో జైషే మహ్మద్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40మందికిపైగా సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయిన విషయం తెలిసిందే.