ఢిల్లీ: కశ్మీర్లోని పుల్వామాలో భారత మిలటరీ కాన్వాయ్పై జైషే మహమ్మద్ ఉగ్రదాడికి ప్రతీకారంగా.. భారత్ ఆర్మీ పాకిస్తాన్లోని బాలాకోట్పై వైమానిక దాడులు జరిపిన విషయం తెలిసిందే. భారత్ చేసిన ఈ సర్జికల్ దాడుల్లో వందల సంఖ్యల్లో ఉగ్రవాదులు హతం అయ్యారని కేంద్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది.
పాకిస్తాన్ మాత్రం భారత్ దాడిలో ఎవరూ చనిపోలేదని ప్రకటనలు చేసింది. అయితే ఈ దాడుల్లో భారత్లోని విపక్ష పార్టీలు సైతం అనుమానం వ్యక్తం చేశాయి. ఎంతమంది చనిపోయారో ఖచ్చితంగా చెప్పాలని డిమాండ్ చేశాయి.
చదవండి: ఇప్పుడేమంటారు?: పాకిస్తాన్ ఎఫ్-16 కూల్చివేతపై తిరుగులేని ఆధారాలు! రాడార్ చిత్రాలు విడుదల చేసిన ఐఏఎఫ్…
ఇటలీ జర్నలిస్ట్ కథనం ఏంటంటే?
ఈ నేపథ్యంలో ఇటలీకి చెందిన ప్రముఖ జర్నలిస్ట్ ఫ్రాన్సెస్కా మారినో తాజాగా దీనిపై సంచలన విషయాలని వెల్లడించింది. బాలాకోట్లో భారత వైమానిక దాడుల్లో 130-170 మంది జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారని మారినో పేర్కొన్నారు.
తమకు లభ్యమైన సమాచారం ప్రకారం దాడుల విషయంలో పాక్ అబద్ధాలు చెబుతోందని వివరించింది. భారత దాడి జరిపిన రెండున్నర గంటల్లోపే పాక్ ఆర్మీ శింకియారీ బేస్ క్యాంప్ నుంచి బాలాకోట్కు వచ్చిందన్నారు.
ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన వారిని శింకియారీకి తరలించి చికిత్స అందించిందని మారినో తన కథనంలో తెలిపింది. ఇక దాడిలో గాయపడిన వారిలో 45 మంది ఇప్పటికీ అక్కడ చికిత్స పొందుతున్నారని, అందులో చికిత్స పొందుతూ 20 మంది మరణించారని పేర్కొంది. మిగతా వారు పాక్ ఆర్మీ అదుపులో ఉన్నారని తెలిపింది.