విశాఖపట్టణం: వైసీపీ అధినేత వైఎస్ జగన్పై ఈ నెల 25న విశాఖపట్నం విమానాశ్రయంలో కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన కేసులో జ్యూడీషియల్ రిమాండ్లో ఉన్న శ్రీనివాసరావును విశాఖపట్టణం పోలీసులు ఆదివారం కస్టడీలోకి తీసుకొన్నారు.
సోమవారం కూడా శ్రీనివాసరావును పోలీసులు విచారిస్తున్నారు. వైఎస్ జగన్పై దాడి జరిగిన రోజునే 10 మంది అనుమానితులను విచారించారు. ఈ కేసులో అనుమానితుల విచారణ కొనసాగుతూనే ఉంటుందని పోలీసులు ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను కూడా రెండు రోజుల్లో వెల్లడించనున్నట్టు పోలీసులు చెబుతున్నారు.
చదవండి: వైఎస్ జగన్పై హత్యాయత్నం, కోడి పందేలకు వాడే కత్తితో దాడి…
హత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాసరావుకు వివిధ బ్యాంకుల్లో మూడు ఖాతాలు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. అలాగే శ్రీనివాసరావు కాల్డేటా, ఎయిర్పోర్ట్లోని సీసీటీవీ ఫుటేజీని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
వంట గదిలో ఉండాల్సిన వాడు…
వైఎస్ జగన్పై హత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాసరావు నిజానికి వంట గదిలో తన విధులు నిర్వహించాల్సి ఉండగా… ఎందుకు సర్వీస్ బోయ్గా మారాడనే విషయమై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. నాలుగు బృందాలుగా పోలీసులు ముమ్మడివరం మండలంలో విచారణ జరుపుతున్నారు. శ్రీనివాసరావుకు లేఖ రాసి పెట్టిన రేవతిపతిని, విజయలక్ష్మీలను కూడా పోలీసులు విచారిస్తున్నారు.
ఒకే సిమ్తో 9 సెల్ఫోన్లు…
నిందితుడు శ్రీనివాసరావు ఒకే సిమ్తో 9 సెల్ఫోన్లను ఉపయోగించినట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అతి తక్కువ కాలంలోనే అతడు 9 సెల్ఫోన్లను మార్చడం వెనుక ఉన్న కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అంతేకాదు, అతడు ఉపయోగించిన వాటిలో నాలుగు సెల్ఫోన్లను పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకొన్నారు. ఈ ఫోన్లలో ఉన్న సమాచారాన్ని కూడా సేకరించేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు.
శ్రీనివాసరావు ఉపయోగించిన సెల్ఫోన్ కాల్ డేటాను విశ్లేషించేందుకు పోలీసు అధికారి ఫకీరప్ప సహాయం తీసుకొంటున్నారు. ఈ కేసు దర్యాప్తులో ఫకీరప్ఫ కూడా భాగస్వామిగా ఉన్నారు. కాల్డేటాను విశ్లేషించి అనేక కేసులను పరిష్కరించిన రికార్డు ఫకీరప్పకు ఉండడంతో.. ఈ కేసులో ఐటీ నిపుణులతో పాటు ఫకీరప్ఫ కూడా శ్రీనివాపరావు కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు.
మూడు బ్యాంకుల్లో ఖాతాలు…
శ్రీనివాసరావుకు ఆంధ్రాబ్యాంకు, స్టేట్ బ్యాంకు, విజయా బ్యాంకుల్లో మూడు ఖాతాలున్నాయని పోలీసులు గుర్తించారు. ఈ ఖాతాల్లో డబ్బులు ఎవరెవరి నుండి శ్రీనివాసరావుకు వచ్చాయి.. ఎంత మొత్తంలో డబ్బులు వచ్చాయి, ఎలా వచ్చాయనే విషయమై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
మరోవైపు విశాఖ ఎయిర్పోర్ట్లో సీసీటీవీ పుటేజీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల రోజులకు పైగా సీసీటీవీ పుటేజీని తమ అధీనంలోకి తీసుకున్న పోలీసులు ఆ ఫుటేజిని కూడా నిపుణుల సహాయంతో విశ్లేషిస్తున్నారు.