విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు శనివారం జనసేన పార్టీలో చేరారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనసేన కండువా కప్పి ఆయన్ని తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ.. టీడీపీలో తనకు తగిన గౌరవం లభించడం లేదని, అందుకే తాను పార్టీ మారానని తెలిపారు.
రావెల కిషోర్ బాబు శుక్రవారం వరకు తెలుగు దేశం పార్టీలో కొనసాగారు. 2014 ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున గెలిచిన ఆయన అనూహ్యంగా మంత్రి కూడా అయ్యారు. అయితే 2017, మార్చిలో జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా సీఎం చంద్రబాబు ఆయనకు ఉద్వాసన పలికారు.
అంతేకాకుండా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో పలు విషయాల్లో రావెల కిషోర్ బాబుకు అభిప్రాయభేదాలు తలెత్తాయి. దీంతో కొంతకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారు.
జనసేనలో చేరాలని నిర్ణయించుకున్న తరువాత.. శుక్రవారం టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, తన ఎమ్మెల్యే పదవికి రావెల రాజీనామా సమర్పించారు. ఆ మర్నాడే.. అంటే శనివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా రావెల ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.