హైదరాబాద్: మాజీ కేంద్ర మంత్రి, తెలుగుదేశం ఎంపీ సుజనా చౌదరికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు షాక్ ఇచ్చారు. సుజనా చౌదరికి సంబంధించిన పలు సంస్థపై ఈడీ అధికారులు దాడులు జరుపుతున్నారు. హైదరాబాద్లోని నాగార్జున హిల్స్లో ఉన్న సుజనా చౌదరికి చెందిన కంపెనీలో గత రెండు రోజులుగా సోదాలు చేస్తున్నారు.
స్ప్లెన్డిడ్ మెటల్ ప్రోడక్ట్స్ లిమిటెడ్, సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్, బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీలలో శుక్రవారం రాత్రి వరకు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అలాగే నాగార్జున హిల్స్లోని ఆయన ఆఫీసులో శుక్రవారం రాత్రి పలు పత్రాలను అధికారులు పరిశీలించి, కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
కొనుగోళ్లు చేయకుండానే…
డొల్ల కంపెనీల ద్వారా కోట్ల రూపాయలు కొల్లగొట్టారని సుజనాచౌదరిపై ఆరోపణలు ఉన్నాయి. సుజనా చౌదరి సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులను డైరెక్టర్లుగా పెట్టి షెల్ కంపెనీలు ప్రారంభించినట్లు ఆరోపణలు వచ్చాయి.
గంగా స్టీల్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, భాగ్యనగర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ లిమిటెడ్, తేజస్విని ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ టెక్ ఇండస్ట్రీస్ కంపెనీలకు పెద్ద ఎత్తున డబ్బును మళ్లించారని ఆరోపణలు ఉన్నాయి. ఎలాంటి కొనుగోళ్లు చేయకుండానే… కేవలం రసీదుల రూపంలో డబ్బులు మళ్లించినట్లు తెలుస్తోంది. ఈ ఆరోపణలపై 2016ఫి బ్రవరిలోనే సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
3 బ్యాంకుల నుంచి రూ.304 కోట్లు…
దాదాపు మూడు బ్యాంకుల నుంచి రూ.304 కోట్లు రుణాలుగా తీసుకుని దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఆంధ్రాబ్యాంకు నుంచి 60 కోట్లు, కార్పోరేషన్ బ్యాంకు 120, సెంట్రల్బ్యాంకు 124 కోట్లు అప్పుగా తీసుకున్నారు. చాలావరకు నిధులను డొల్లకంపెనీలకు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకుల ఫొరెన్సిక్ ఆడిటింగ్లోనూ ఈ విషయం తేటతెల్లమైనట్లు తెలుస్తోంది.
గత అక్టోబర్లోనూ ఈ కేసులకు సంబంధించి ఈడీ సోదాలు నిర్వహించి పెద్ద ఎత్తున హార్డ్డిస్క్లు, ఫైల్స్తో పాటు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. దాదాపు మూడేళ్ల నుంచి జరుగుతున్న ఈ కేసుల విచారణ కీలక దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈడీ చేసిన సోదాల్లోనూ పెద్ద ఎత్తున డాక్యుమెంట్లు దొరికినట్లు తెలుస్తోంది.