న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ప్రమేయాన్ని రాష్ట్రంలో నిరాకరిస్తూ.. అందుకు సంబంధించి గతంలో జారీ చేసిన సమ్మతి ఉత్తర్వులను రద్దుచేసిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ విషయమై స్పందించారు. తీవ్రమైన తప్పులు చేసినవారే సీబీఐకి భయపడి సమ్మతి ఉత్తర్వులను రద్దు చేస్తున్నారంటూ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ఢిల్లీలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో జైట్లీ మాట్లాడారు. శాంతిభద్రతల విషయం రాష్ట్రాల పరిధిలోనే ఉన్నప్పటికీ అవినీతి విషయంలో ఏ రాష్ట్రానికీ సార్వభౌమాధికారం లేదని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్లో ఏదో జరుగుతుందన్న భయంతోనే చంద్రబాబు ప్రభుత్వం సీబీఐ సమ్మతి ఉత్తర్వులను రద్దు చేసిందని వ్యాఖ్యానించారు.
తమ రాష్ట్రాల్లో జరిగిన అవకతవకలను కప్పిపుచ్చుకోవడంలో భాగంగానే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు సీబీఐ విచారణ చేపట్టకుండా ఇలా సమ్మతిని రద్దు చేస్తున్నాయని జైట్లీ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు భయపడుతున్నారని, అందుకే ముందు జాగ్రత్తగా సీబీఐని ఏపీలో అడుగుపెట్టనీయకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని, కానీ ఇప్పటికే దర్యాప్తు చేస్తోన్న కేసుల్లో సీబీఐని ఎవరూ అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు.