శ్రీకాకుళం జిల్లా పర్యటనను రద్దు చేసుకున్న చంద్రబాబు, ఇక ఇంట్లోనే దీపావళి, ఎందుకంటే…

cm-chandrababu
- Advertisement -

cm-chandrababu

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దయింది. ఈసారి దీపావళిని శ్రీకాకుళం జిల్లాలో టిట్లీ తుపాను బాధితుల నడుమ జరుపుకోవాలని గతంలో నిర్ణయించిన చంద్రబాబు తాజాగా తన మనసు మార్చుకుని కుటుంబ సభ్యుల నడుమ జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో బుధవారం నాటి ఆయన శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దయింది.

టిట్లీ తుపాను బాధితుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు ఈసారి వారి మధ్యనే దీపావళిని జరుపుకుంటానని అంతకుముందు చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సాధరణ పరిస్థితులు నెలకొల్పేందుకు ఆయా శాఖల ఉద్యోగులు ఇన్ని రోజులూ నిర్విరామంగా కష్టపడ్డారు. ఇప్పుడు మళ్లీ తాను జిల్లా పర్యటనకు వెళితే, సెలవు రోజుల కూడా ఉద్యోగులు అక్కడ ఉండాల్సి వస్తుందని, దాంతో ఉద్యోగులు ఇబ్బందికి గురవుతారని భావించిన చంద్రబాబు తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.

అంతేకాదు, కనీసం దీపావళి పండుగ ముందురోజైనా అధికారులు, ఉద్యోగులు త్వరగా ఇళ్లకు చేరాలన్న ఉద్దేశంతో మంగళవారం నాటి కేబినెట్ సమావేశాన్ని కూడా చంద్రబాబు ఉదయం పూటే ప్రారంభించారు. ఇక సీఎం చంద్రబాబునాయుడు కూడా ఈ దీపావళిని కుటుంబ సభ్యుల మధ్యనే జరుపుకుంటారని సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది.

- Advertisement -