శ్రీకాకుళం: ‘టీట్లీ’ తుపాను విలాయనికి కకావికలమైన శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఏరియల్ సర్వే నిర్వహించారు. తుపాను ధాటికి జిల్లాలో తీవ్రంగా దెబ్బతిన్న పలు ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా ఆయన వీక్షించారు. పలాస, మందస, కాశీబుగ్గ, వంశధారతో పాటు తుపాను కారణంగా ద్వంసమైన పలు ప్రాంతాలను సీఎం పరిశీలించారు.
చదవండి: వణికిస్తోన్న‘టిట్లీ’ తుపాను, రెండు జిల్లాల్లో 8 మంది మృతి, రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, తీరం దాటినా…
ఏరియల్ సర్వే అనంతరం చంద్రబాబు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఆయా ప్రాంతాల బాధితుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. తుపాను బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమైందని, అందువల్ల విపరీతమైన ప్రాణ నష్టాన్ని నివారించగలిగామని చంద్రబాబు తెలిపారు. ప్రజలు ఆందోళన పడవలసిందేమీ లేదని, అందరికీ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారాయణ, శ్రీకాకుళం ఎంపీ రామ్మెహన్ నాయుడు పర్యటించారు.
గురువారం రాత్రే శ్రీకాకుళానికి…
చంద్రబాబు నాయుడు గురువారం రాత్రే శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్నారు. తుపాను ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న శ్రీకాకుళం జిల్లాలో పునరావాస చర్యలను దగ్గరుండి పర్యవేక్షించేందుకు ఆయన జిల్లాకు చేరుకున్నారు. అనంతరం జిల్లా ఉన్నతాధికారులు, మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
తక్షణం విద్యుత్తు పునరుద్ధరణ చర్యల్లో భాగంగా కుప్పకూలిపోయిన విద్యుత్తు స్తంభాలకు మరమ్మతులు చేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి సిబ్బందిని తీసుకురావాలని చంద్రబాబు ఆదేశించారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడం, సీఎం పర్యటిస్తుండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్సాటు చేశారు.