న్యూఢిల్లీ: ఆదాయపన్ను దాఖలుకు చివరి రోజైన శనివారం రికార్డు స్థాయిలో ఐటీ రిటర్న్స్ దాఖలయ్యాయి. ఏకంగా 49 లక్షల మంది ఐటీ రిటర్న్స్ దాఖలు చేయగా మొత్తం 5.65 కోట్ల రిటర్న్స్ దాఖలయ్యాయి.
నోట్ల రద్దు తర్వాత ఆదాయపన్ను ఈ స్థాయిలో వసూలు కావడం ఇదే తొలిసారి. ఆదివారం ఆదాయపు పన్ను శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2018-19లో ఆదాయపు పన్ను దాఖలులో 4 శాతం వృద్ధి నమోదైంది.
భారీ జరిమానా నేపథ్యంలో…
గతేడాది ఇదే సమయానికి 5.4 కోట్ల పన్ను రిటర్న్స్ వచ్చాయి. గడువు ముగిసిన తర్వాత దాఖలు చేసే రిటర్న్స్ కు ప్రభుత్వం భారీగా ఫీజు వసూలు చేస్తుండడంతో ఈసారి చాలామంది గడువులోగానే పన్ను చెల్లించడంతో ఈ వృద్ధి నమోదైంది.
శనివారం ఒక్క రోజే 49 లక్షల మంది పన్ను రిటర్న్న దాఖలు చేయగా అందులో 25 శాతం గత ఐదు రోజుల్లోనే దాఖలు కావడం గమనార్హం. శనివారం అత్యధికంగా ప్రతీ సెకనుకు 196 ఐటీఆర్ (ఐటీ రిటర్న్స్) దాఖలు కాగా, నిమిషానికి 7,447 ఐటీఆర్లు దాఖలు కావడం గమనార్హం.