న్యూఢిల్లీ: యూట్యూబ్లో పోస్టు చేసే వీడియోలకు ఒక్కసారి ఒక్క రోజులోనే లక్షల్లో, కోట్లలో వ్యూస్ వస్తుంటాయి. అయితే, ఈ వ్యూస్ నిజంగా వచ్చినవి కావని, మానిప్యులేట్ చేయడం ద్వారా వ్యూస్ను పెంచుకుంటున్నారని భావించిన యూట్యూబ్ కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది.
ఈ ఏడాది జులైలో ఓ భారతీయ ర్యాప్ సింగర్ వీడియో కేవలం ఒక్క రోజులోనే యూట్యూబ్లో 7.5 కోట్ల వ్యూస్ సాధించింది. ఈ సంఖ్యను మ్యానిపులేట్ చేశారని, తప్పుడు మార్గాల్లో పెంచారని తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి.
దీనిపై స్పందించిన యూట్యూబ్ నిర్వాహకులు ఇకపై పెట్టే వీడియోలకు కొన్ని ప్రత్యేక నిబంధనలు తీసుకొచ్చారు. ఇకపై అప్లోడ్ చేసే వీడియోల్లోని యాడ్స్ ఎంతమంది చూశారని కాకుండా ఇతర పద్ధతుల ఆధారంగా ఎంతమంది చూశారన్న లెక్కను గణిస్తామని యూట్యూబ్ పేర్కొంది.
అలాగే 24 గంటల్లో రికార్డు వ్యూస్ అన్న అంశంపైనా మార్పులు చేయనున్నట్టు తెలిపింది. వీడియోను డైరెక్ట్గా షేర్ చేసుకుని సెర్చ్ చేసి వీడియోలు చూడడం వంటి సహజ సిద్ధమైన ప్రక్రియల ఆధారంగా ఎంతమంది చూశారన్న విషయం కౌంటింగ్ నిర్వహిస్తామని యూట్యూబ్ పేర్కొంది.