మనం ఆహారం ద్వారా తీసుకునే కొవ్వు పదార్థాలలో అత్యంత ప్రమాదకారమైనవి.. ట్రాన్స్ ఫ్యాట్స్. ఇవి మన ఆరోగ్యాన్ని హరిస్తాయి. ప్రాణాలను పిప్పి చేస్తాయి. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ట్రాన్స్ ఫ్యాట్స్పై యుద్ధం ప్రకటించేసింది. మనం తీసుకునే ఆహారంలో ఈ రకం కొవ్వులు లేకుండా చూడాలని.. 2023 నాటికల్లా ప్రపంచ దేశాలన్నీ ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ వాడకాన్ని ఆపేయాలంటూ డెడ్లైన్ విధించింది. ఈ నేపథ్యంలో అసలు ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే ఏమిటి? అవి ఎలా ఏర్పడతాయి? వాటి వల్ల కలిగే దుష్పరిణామామిటి, ఏయే ఆహార పదార్థాలలో అవి ఉంటాయో చూద్దాం.
సాధారణంగా ఆహార పదార్థాలు ఎక్కువ కాలం నిల్వఉంచడానికి, ఆహారపు రుచిని పెంచేందుకు ఈ ట్రాన్స్ ఫ్యాట్లను వాడతారు. కేకులు, పేస్ట్రీలు, బ్రెడ్, బిస్కెట్లు, శాండ్విచ్, చాక్లెట్స్, వేఫర్స్, మైక్రోవేవ్ పాప్కార్న్, పిజ్జా, ఐస్క్రీమ్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెన్ , రెడీ టు ఈట్ ఆహార పదార్థాలలో ఇవి ఉంటాయి. ప్రకృతి సహజంగా ఈ ట్రాన్స్ఫ్యాట్స్ మాంసం, పాల ఉత్పత్తుల్లో ఉంటాయి. అలాగే వంటనూనెలను వేడి చేసినప్పుడు.. లేదంటే నూనెకు నీరు లేదా తేమ కలిస్తే ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ఏర్పడతాయి.
ఇప్పటివరకు ఫుడ్ ప్రోసెసింగ్ కంపెనీలు అవి తయారు చేసే ఆహార పదార్థాలలో 5 శాతం వరకు ట్రాన్స్ఫ్యాట్స్ని ఉపయోగించవచ్చని నిబంధనలు పేర్కొంటున్నప్పటికీ… ట్రాన్స్ఫాట్స్ కలిగిన వెజిటబుల్ ఆయిల్స్, వెజిటబుల్ ఫ్యాట్, హైడ్రోజెనేటెడ్ వెజిటబుల్స్ వాడకాన్ని 2 శాతానికి తగ్గించాలని భారత ఆహార భద్రత ప్రమాణాల అథారిటీ ప్రతిపాదిస్తోంది. మనం తినే ఆహారం ద్వారా ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ మన శరీరంలోకి చేరడం వల్లే మధుమేహం , గుండె సంబంధిత వ్యాధులు , కేన్సర్ వంటి వ్యాధులు మనకు సోకుతున్నాయి. ఈ విషయాన్ని గ్రహించే డెన్మార్క్, స్విట్జర్లాండ్, కెనడా, బ్రిటన్ అమెరికా దేశాలు ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ వాడకంపై నిషేధం విధించాయి.