న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమ్కి బానిస అయిన ఓ యువకుడు తన తల్లిదండ్రులు, సోదరిని అతి కిరాతకంగా చంపాడు. ఈ దారుణం ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో జరిగింది. ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న సూరజ్ అనే యువకుడు ఈ ఘోరానికి పాల్పడి చివరికి అరెస్ట్ అయ్వాడు. అయితే అతడిలో తాను సొంత కుటుంబీకులను పొట్టనబెట్టుకున్నాననే పశ్చాత్తాపం ఏకోశానా లేకపోగా, ఎలాగైనా శిక్ష పడకుండా తనను తప్పించాలని పదేపదే కోరుతుండడం గమనార్హం.
పోలీసుల కథనం ప్రకారం… మెహ్రౌలీ ప్రాంతంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొన్న సూరజ్(19) అనే యువకుడు ప్రతిరోజు కాలేజీ క్లాసులు ఎగ్గొట్టి.. ఇంట్లోనే కూర్చుని ‘పీయూజీజీ’ అనే ఆన్లైన్ గేమ్ని విపరీతంగా ఆడేవాడు. ఈ గేమ్ అడేందుకు ఏకంగా 10 మంది యువతీ యువకులతో ఓ వాట్సాప్ గ్రూప్ను కూడా నడిపేవాడు. ఆ అద్దె ఇంట్లో చేరి వీరంతా ఎల్లప్పుడు ఆన్లైన్ గేమ్ ఆడడంలో మునిగిపోయేవారు.
ఈ విషయంలో సూరజ్ తల్లిదండ్రులు గతంలో చాలాసార్లు అతడ్ని కోప్పడ్డారు. చదువుపై శ్రద్ధ పెట్టడం లేదని మందలించడంతో వారిపై సురజ్ కక్ష పెంచుకున్నాడు. తల్లిదండ్రలతోపాటు సోదరిని కూడా కత్తితో అతి కిరాతకంగా పొడిచి చంపాడు. అనంతరం తమ ఇంట్లో దోపిడీ జరిగినట్లుగా, దోపిడీకి వచ్చిన వారు తన తల్లిదండ్రులను, సోదరిని చంపినట్లుగా చిత్రించే ప్రయత్నం చేశాడని పోలీసులు తెలిపారు. వీడియో గేమ్కు బానిసై.. కుటుంబ సభ్యుల అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో నిందితుడు ఈ నేరానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.