హైదరాబాద్: ఏపీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో ఆ పార్టీ నేతలు కొందరు వైసీపీలో చేరడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన నటి దివ్యవాణి కూడా పార్టీ మారతారని వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తాను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, వైసీపీలో చేరనున్నట్టు వస్తున్న వార్తలపై దివ్యవాణి స్పందించారు. తాను తెలుగుదేశం పార్టీని వీడబోనని, డబ్బు కోసమో, పదవి కోసమో తాను వైసీపీలో చేరబోనని చెప్పారు.
అయితే తెలుగుదేశం పార్టీలో తాను ఇమడలేనని అనిపించిన నాడు, అధినేత చంద్రబాబుకు చెప్పిన తరువాతే పార్టీకి రాజీనామా చేస్తానని అన్నారు. ఇక ఏపీ ప్రజలు ఎన్నికల్లో ఇచ్చిన తీర్పును తాను స్వాగతిస్తున్నానని, తనను వైసీపీ నుంచి ఎంతో మంది పిలిచారని, తాను డబ్బుకు ఆశపడే అమ్మాయిని కాదని అన్నారు.
ఇక ఎన్నికల్లో వైసీపీకి 175 సీట్లూ వచ్చుంటే తాను ఇంకా ఆనందించేదాన్నని, అప్పుడైనా చంద్రబాబునాయుడికి తన కుటుంబ సభ్యులతో గడిపేందుకు కాస్తంత సమయం లభించేదని వ్యాఖ్యానించారు.
అలాగే తాను పవన్ పై ఎన్నడూ విమర్శలు మాత్రం చేయలేదని, జనసేనతో కలిసి పనిచేయాల్సిన అవసరం టీడీపీకి లేదని చెప్పారు.