చోడవరం: విశాఖపట్నం జిల్లా చోడవరం పట్టణ శివారులోని అటవీశాఖకు చెందిన వెదురు డిపో సమీపంలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. పోలీసులు ఈ హత్యను ఆ యువతి ప్రియుడే చేసి ఉంటాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, ఆ యువతిపై అత్యాచారం చేసి.. ఆ తరువాత దారుణంగా హత్య చేసినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది.
పొలీసుల కథనం ప్రకారం.. చోడవరం కోటవీధిలో నివాసముండే ఓ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వారి రెండో కుమార్తె(17) ప్రస్తుతం ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతోంది. కొద్దికాలంగా అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి, ఆమెకు మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది.
ఈ క్రమంలో ఆ యువతి మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి బయటికి వెళ్లింది. కూతురు ఇంట్లో లేకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. రాత్రంతా వెతికినా యువతి ఆచూకీ తెలియలేదు.
పరువు పోతుందని భయపడి…
పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. పరువు పోతుందని భయపడి.. మర్నాడు కూడా ఆమె తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల సహాయంతో ఆమె కోసం గాలించారు. ఈ నేపథ్యంలో.. అటవీశాఖ వెదురు డిపోలో ఓ యువతి శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తొలుత గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసుకున్నారు. ఆ యువతి మృతదేహన్నిపోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ విషయం కుమార్తె కోసం వెతుకుతున్న తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వారు అక్కడికి చేరుకుని.. మృతదేహాన్ని పరిశీలించి.. అది తమ కుమార్తెదేనని తెలిసి ఘొల్లుమన్నారు. తమ కుమార్తెకు, అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్లు పోలీసులకు తెలిపి… అతడే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు.
వారిచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.