హైదరాబాద్: నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ నడిబొడ్డున శుక్రవారం పట్టపగలు జరిగిన దారుణ హత్యకు ‘పరువు’ కోసం పాకులాడిన ఓ తండ్రి దుర్మార్గమే కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. వైశ్య కుటుంబానికి చెందిన అమృత, షెడ్యూల్డ్ కులానికి చెందిన ప్రణయ్ని వివాహం చేసుకోవడంతో అమృత తండ్రి తిరునగరు మారుతీరావు కక్ష పెంచుకుని ఈ హత్య చేయించారని పోలీసులు భావిస్తున్నారు.
ఎన్నిసార్లు బెదిరించినా, కేసులు పెట్టినా తమ కుమార్తె అమృత తాను ప్రేమించిన ప్రణయ్వైపే ఉండటాన్ని మారుతీరావు కుటుంబం తట్టుకోలేక పోయిందని, ఒకవైపు కూతురుతో ప్రేమ, ఆప్యాయతలను నటిస్తూనే.. కిరాయి హంతకులను మాట్లాడుకుని ఆమె భర్త ప్రణయ్ని కడతేర్చారని చెబుతున్నారు.
‘పరువు’ కోసం కన్నకూతుర్నే…
మిర్యాలగూడ వినోభానగర్లో నివసిస్తున్న పెరుమాళ్ల బాలస్వామి, ప్రేమలత దంపతులకు ఇద్దరు కుమారులు. బాలస్వామి ఎల్ఐసీ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నారు. వారి పెద్ద కుమారుడు ప్రణయ్(24) ఇటీవలే బీటెక్ పూర్తి చేశాడు. అదే పట్టణానికి చెందిన ప్రముఖ బిల్డర్, రియల్టర్ తిరునగరు మారుతీరావు కుమార్తె అమృత వర్షిణిని ప్రేమించాడు. వీరిద్దరూ ఈ ఏడాది జనవరి 31న ఆర్యసమాజ్లో వివాహం చేసుకున్నారు.
ఇద్దరి కులాలు వేరు కావడంతో అమృత తండ్రి మారుతీరావు వారి వివాహాన్ని వ్యతిరేకించాడు. వివాహానంతరం అమృత ప్రణయ్ ఇంట్లోనే ఉంటోంది. అయితే మారుతీరావు తన పట్టును వీడలేదు. పట్టణంలోని పలువురు ప్రముఖులతో కలిసి తన కుమార్తెను తిరిగి తన ఇంటికి తెచ్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ అమృత ఒప్పుకోలేదు. ఓసారి ప్రణయ్, అమృత జిల్లా ఎస్పీని కలసి తమ వివాహం గురించి వివరించి, రక్షణ కల్పించాల్సిందిగా కోరారు. నెల రోజుల క్రితం ప్రణయ్, అమృతల రిసెప్షన్ జరగ్గా, అమృత తల్లిదండ్రులు వెళ్లలేదు.
కిరాయి హంతకులకు ‘సుపారీ’…
అంతేకాదు, కూతురి రిసెప్షన్ తర్వాత అమృత తండ్రి మరింత కక్ష పెంచుకున్నాడని, ఈ నేపథ్యంలో కిరాయి హంతకులతో ప్రణయ్ని హత్య చేయించడానికి సుపారీ ఇచ్చారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అమృత గర్భవతి కావడంతో ప్రణయ్, అమృతలు మధ్యాహ్నం 12 గంటలకు జ్యోతి హాస్పిటల్కు పరీక్షల నిమిత్తం వచ్చారు.
పరీక్షలు పూర్తయిన తర్వాత 1.30కు ఆస్పత్రి నుంచి బయటకు వస్తుండగా వెనుకనుంచి వచ్చిన హంతకుడు మటన్ షాపులో వినియోగించే కత్తితో ప్రణయ్ మెడపై నరికాడు. వెంటనే మరొక వేటు వేయడంతో ప్రణయ్ అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి మృతి చెందాడు. హంతకుడు కత్తిని సమీపంలోనే పడవేసి పరారయ్యాడు.
వివాహమైన 2 నెలల తర్వాత నుంచి తన హత్యకు కుట్ర జరుగుతోందన్న అనుమానంతో ప్రణయ్ అప్రమత్తంగా ఉంటున్నాడు. ఇటీవల అమృతతో వారి తల్లిదండ్రులు ఫోన్లో మాట్లాడటం ప్రారంభించారు. నమ్మించి తమ కొడుకును హత్య చేయించారని ప్రణయ్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
సీసీ ఫుటేజీ స్వాధీనం…
హత్య జరిగిన వెంటనే ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ ఎ.వి.రంగనాథ్, డీఎస్పీ పి.శ్రీనివాస్, ఆర్డీఓ జగన్నాథరావు, తహసీల్దార్ కృష్ణారెడ్డి పరిశీలించారు. డాగ్స్క్వాడ్ను రప్పించి నిందితుడు వెళ్లిన ప్రదేశాలను తెలుసుకున్నారు. హత్య జరిగిన ప్రదేశం నుంచి డాగ్స్క్వాడ్ చర్చిరోడ్డు మీదుగా రెడ్డికాలనీ, అక్కడి నుంచి ఇండస్ ఇండ్ బ్యాంకు మీదుగా గాంధీ విగ్ర హం రోడ్డు వరకు, అటు నుంచి సాగర్రోడ్డు మీదుగా బైపాస్రోడ్డు వరకు వెళ్లిందని పోలీసులు తెలిపారు.
పరువు హత్యే: ఎస్పీ రంగనాథ్
ప్రణయ్ హత్య జరిగిన చోట జ్యోతి హాస్పిటల్ సీసీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జ్యోతి హాస్పిటల్ నుంచి ప్రణయ్, అమృతతో పాటు మరో యువతి బయటకు వస్తుండగా వెనుక నుంచి కత్తి పట్టుకొని వచ్చిన వ్యక్తి హత్య చేస్తున్న దృశ్యం నమోదైన ఫుటేజీని రంగనా«థ్ పరిశీలించారు. ప్రణయ్ హత్య వెనుక అమృత తండ్రి తిరునగరు మారుతీరావు, ఆమె బాబాయి తిరునగరు శ్రవణ్లు ఉన్నట్లు అనుమానిస్తున్నామని, దీనిని పరువు హత్యగానే భావిస్తున్నామని జిల్లా ఎస్పీ ఎ.వి.రంగనాథ్ చెప్పారు.
సంఘటనా స్థలాన్ని సందర్శించిన అనంతరం ఆయన ఏరియా ఆస్పత్రి మార్చురీలో ఉన్న ప్రణయ్ మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రణయ్ హత్య ప్రొఫెషనల్ కిల్లర్స్ చేత చేయించినట్లు అనుమానాలున్నాయని చెప్పారు.
పరారీలో నిందితులు…
మారుతీరావు తన కూతురు ఒక ఎస్సీ యువకుడిని వివాహం చేసుకున్నందుకు కక్ష పెంచుకొని ఈ హత్య చేయించినట్లు తెలుస్తోందన్నారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని, ప్రణయ్ హత్యకేసులో పరారీలో ఉన్న ఏ–1 నిందితుడు తిరునగరు మారుతీరావు, ఏ–2 నిందితుడు శ్రవణ్ల ఆచూకీ తెలిసిన వారు తమకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ రంగనాథ్ కోరారు.
హత్య చేసిన గుర్తుతెలియని దుండగుల్ని పట్టుకునేందుకు గాలింపు మొదలుపెట్టామన్నారు. నిందితుల ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషికం అందచేస్తామని ఆయన తెలిపారు. నిందితులను పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, సాధ్యమైనంత త్వరలో వారిని పట్టుకుంటామని చెప్పారు.
హత్య చేయించింది మారుతీరావే: హతుడి తల్లిదండ్రులు
తమ కుమారుడిని తిరునగరు మారుతీరావే హత్య చేయించాడని ప్రణయ్ తల్లిదండ్రులు పెరుమాళ్ల బాలస్వామి, ప్రేమలత ఆరోపించారు. తమ కొడుకుకు ప్రాణహాని ఉందని పెళ్లైన కొత్త లోనే ఐజీకి ఫిర్యాదు చేశామని.. పోలీసులు కూడా ఇవాళ తమ కొడుకుని కాపాడలేకపోయారని కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఈ పెళ్లి వద్దంటూ ఎన్నిసార్లు చెప్పినా అమ్మాయి ఇష్టపడి రావడంతో హైదరాబాద్లోని ఆర్య సమాజ్లో ప్రేమ వివాహం చేసుకున్నారని, అక్కడే కొంతకాలం కాపురం చేశారని, అక్కడ కూడా అమ్మాయి తండ్రి మారుతీరావు మనుషులు ఆరా తీయడంతో అక్కడ ఇల్లు ఖాళీచేసి మిర్యాలగూడకు మకాం మార్చారన్నారు.
తమ కుమారుడు అమృతను ప్రేమ వివాహం చేసుకున్న నాటి నుంచి మారుతీరావు తమ కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడన్నారు. ఇంతకు ముందే హత్య చేయాలని పథకం పన్నారని, అనుమానం వచ్చి అప్పటి నుంచి జాగ్రత్తగా ఉంటున్నామని అన్నారు. అయితే కాపు కాసి కిరాయి హంతకులతో హత్య చేయించాడని ఆరోపించారు. మారుతీరావును కఠినంగా శిక్షించి, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.