హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజ్తరుణ్ కారు ప్రమాద ఘటనపై మిస్టరీ వీడడం లేదు. అల్కాపురి కాలనీ గుండా సోమవారం రాత్రి టీఎస్ 09 ఈఎక్స్ 1100 కారు వేగంగా దూసుకొచ్చి డివైడర్ను ఢీకొట్టింది. అనంతరం రోడ్డు పక్కన ఉన్న పిట్టగోడను ఢీకొట్టి ఖాళీ స్థలంలో ఆగిపోయింది.
ఈ ఘటనలో కారు ధ్వంసం కాగా, కారులో ఉన్న యువకుడు కిందకు దిగి సెల్ఫోన్లో మాట్లాడుతూ రోడ్డు దాటి వెళ్లిపోయాడు. ఈ ఘటన స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డైంది. సంఘటన సమయంలో రాజ్తరుణ్ కారులో ఉన్నారని స్థానికులు చెబుతున్నారు.
అయితే, నార్సింగి పోలీసులు మాత్రం ఈ విషయంలో స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదు. ప్రస్తుతం విచారిస్తున్నామని చెబుతున్నారు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు. కారు నంబరు ఆధారంగా స్కేజోన్ యజమానికి సమాచారం అందించామని చెప్పారు. యజమాని అనుచరుడు ఫోన్లో సంప్రదించాడని, కానీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పోలీసులు తెలిపారు.