చెన్నై: ప్రఖ్యాత దర్శకుడు, దక్షిణాది సినీ దిగ్గజం మణిరత్నం (62)కు హఠాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా గుండెపోటు రావడంతో వెంటనే చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మణిరత్నం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది.
మణిరత్నం భారతీయ చిత్రసీమ గర్వించదగ్గ అనేక కళాత్మక చిత్రాలను తెరకెక్కించారు. నాయకుడు, దళపతి, రోజా, ముంబై, సఖి, ఓకే బంగారం, ఇద్దరు.. వంటి సినిమాలను మణిరత్నం రూపొందించారు. ప్రస్తుతం మణిరత్నం త్వరలో విడుదలకానున్న చెక్క చివంత వనం అనే చిత్రానికి సంబంధించిన పోస్టు ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.
ఈ సినిమా తెలుగులో నవాబ్ పేరుతో రానుంది. రోజా, దళపతి, నాయకుడు, ఓకే బంగారం, బొంబాయి, గురు లాంటి ఎన్నో సూపర్హిట్ సినిమాలను అటు కొలీవుడ్, ఇటు టాలీవుడ్ ప్రేక్షకులకు అందించిన దర్శకుడు మణిరత్నం ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారనే సమాచారం తెలియగానే ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే ప్రస్తుతం మణిరత్నం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆయనకు చికిత్స అందిస్తోన్న వైద్యుల ద్వారా తెలుస్తోంది.