హైదరాబాద్: ఈ మధ్య మన టాలీవుడ్ హీరోలకు అస్సలు టైమ్ బాగున్నట్లు లేదు. మొన్నటికి మొన్న నువ్వు తోపు రా హీరో కార్ యాక్సిడెంట్ అయింది. ఆ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కారుకు కూడా పెద్ద ప్రమాదం తప్పింది. ఇక ఇప్పుడు నాగశౌర్య షూటింగ్ లో గాయపడ్డాడు. నాగశౌర్య ప్రస్తుతం కొత్త దర్శకుడు రమణ తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.
ఇందులో మెహ్రీన్ కౌర్ హీరోయిన్. ఈ చిత్ర షూటింగ్ వైజాగ్లో జరుగుతుంది. భారీ యాక్షన్ సీక్వెన్స్ ఒకటి చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగింది. ఐరా క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న సినిమా షూటింగ్లో భాగంగా, కథానాయకుడు నాగశౌర్య రోప్, డూప్ లేకుండా ఓ యాక్షన్ సన్నివేశంలో నటించారు. ఈ క్రమంలో గాయపడ్డారు.దీనితో నాగశౌర్య ఎడమకాలికి తీవ్ర గాయమైంది.
యాక్షన్ సన్నివేశాల్లో భాగంగా నాగశౌర్య 15 అడుగుల ఎత్తైన ఓ బిల్డింగ్ పైనుంచి కిందకు దూకారు. అయితే, సరైన ప్రదేశంలో ల్యాండింగ్ కాకపోవడంతో మోకాలికి గాయమైంది. ప్రాథమిక చికిత్స అనంతరం నాగశౌర్యను విశాఖపట్నంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు 25 నుంచి 30 రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
కేజీఎఫ్ సినిమాతో గుర్తింపు పొందిన స్టంట్ మాస్టర్ అంబరీవ్ నేతృత్వంలో ఈ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. విశాఖలోని అరిలోవా ప్రాంతంలో 11 రోజుల పాటు షూటింగ్ నిర్వహించాల్సి ఉండగా, ఈ అపశ్రుతి చోటుచేసుకుంది. ఇప్పటికే చిత్రీకరించిన పలు యాక్షన్ సన్నివేశాల్లో డూప్ లేకుండా నాగశౌర్య అద్భుతంగా చేశాడని చిత్ర బృందం వెల్లడించింది.
ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య, ఛలో లాంటి సినిమాలతో నాగశౌర్య పాపులర్ అయ్యారు. హీరోకి గాయాలు అవ్వడంతో షూటింగ్కు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చారు దర్శక నిర్మాతలు. నాగశౌర్య సొంత నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్ లోనే ఈ చిత్రం తెరకెక్కుతుంది.