హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్కు శుక్రవారం హైకోర్టులో ఊరట లభించింది. టీవీ9 చానల్కు సీఈవోగా ఉన్న కాలంలో ఫోర్జరీ, నిధుల మళ్లింపునకు పాల్పడ్డ కేసులో ముందస్తు బెయిలు కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్ ఈరోజు హైకోర్టులో విచారణకు వచ్చింది.
ఈ కేసులో హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ను రవిప్రకాష్కు మంజూరు చేసింది. వారానికి ఒకసారి పోలీసుల ముందు హాజరు కావాలని, అలాగే కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఈ సందర్భంగా హైకోర్టు రవిప్రకాష్ను హెచ్చరించింది.
చదవండి: ఎస్సీ ఎస్టీ ఆట్రాసిటీ కేసు… మోజో టీవీ మాజీ సీఈవో రేవతి అరెస్ట్…
మాజీ సీఈవో రవిప్రకాష్పై ఫోర్జరీ, నిధుల మళ్లింపు తదితర ఆరోపణలతో టీవీ9 చానల్ నూతన యాజమాన్యం అలంద మీడియా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదు మేరకు రవిప్రకాష్పై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విషయంలో విచారణకు పిలిచేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నించగా.. చాలా రోజులపాటు రవిప్రకాష్ అందుబాటులోకి రాలేదు.
ముందుగానే బెయిల్ కోసం ప్రయత్నించినా…
మరోవైపు తనను పోలీసులు అరెస్టు చేస్తారని భావించిన రవిప్రకాష్ ముందస్తుగా తన న్యాయవాది ద్వారా బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆయన గత నెలలో బంజారాహిల్స్ పోలీసులకు లొంగిపోయి, అనంతరం వారి విచారణకు హాజరయ్యారు.
ఈ కేసులో బెయిల్ కోసం గతంలో రవిప్రకాష్ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే తీవ్రమైన ఆర్థికనేరాలకు సంబంధించిన కేసు అయినందున న్యాయస్థానాలు అప్పట్లో బెయిల్ మంజూరు చేయలేదు.
ఈ నేపథ్యంలో తనపై నమోదు చేసిన మూడు ఎఫ్ఐఆర్లపై రవిప్రకాష్ ఇప్పటికే హైకోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించి పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం శుక్రవారం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది.