హైదరాబాద్: తెలంగాణ నుంచి లోక్ సభకు పోటీ చేయబోయే 10మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ గురువారం సాయంత్రం ప్రకటించింది. ఇటీవలే కాంగ్రెస్ నుంచి పార్టీలో చేరిన డీకే అరుణ మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి బరిలో దిగనున్నారు.
కరీంనగర్ నుంచి బండి సంజయ్
సికింద్రాబాద్ నుంచి బండారు దత్తాత్రేయ స్థానంలో జి కిషన్ రెడ్డి పోటీ చేస్తారని బీజేపీ ప్రకటించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అంబర్ పేట నుంచి పోటీ చేసి ఓడారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజాబామాద్ నుంచి ధర్మపురి అరవింద్, మల్కాజ్గిరి నుంచి ఎన్. రామచంద్రారావు, నాగర్ కర్నూల్ నుంచి బంగారు శ్రుతి పోటీ చేయనున్నారు.
నల్గొండ నుంచి గార్లపాటి జితేందర్ కుమార్, భువనగిరి నుంచి పీవీ శ్యాం సుందర్ రావు, వరంగల్ నుంచి చింతా సాంబమూర్తి, మహబూబాబాద్ నుంచి హుస్సేన్ నాయక్ పోటీ చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు ఎంపీ అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీ నారాయణ నర్సరావు పేట నుంచి పోటీ చేస్తుండగా.. పురందేశ్వరి విశాఖపట్నం నుంచి బరిలో దిగనున్నారు.
వారణాసి నుంచే ప్రధాని
కాగా, బీజేపీ గురువారం దేశ వ్యాప్తంగా మొత్తం 184 స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి వారణాసి నుంచే పోటీ చేయనున్నారు. గాంధీనగర్ నుంచి బీజేపీ అధినేత అమిత్ షా బరిలో నిలవనున్నారు. ఇంతకుముందు ఈ స్థానం నుంచి బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ పోటీ చేశారు.