న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ వినియోగదారులకు నిరాశ కలిగించే వార్త అందించింది. ఏటీఎం ద్వారా క్యాష్ విత్డ్రాయల్ పరిమితిని సగానికి సగం కుదిస్తూ షాక్ ఇచ్చింది. ఎస్బీఐ కస్టమర్లు ఏటిఎంల నుండి ఇకపై రోజుకు గరిష్టంగా రూ.20 వేలు నగదు మాత్రమే తీసుకునే వీలు ఉంటుంది. ఇంతకు ముందు ఈ పరిమితి రూ.40 వేలుగా ఉండేది. పండగల సీజన్ వస్తుంటే ఎస్బీఐ ఇలాంటి చేదు వార్త అందించడంపై కస్టమర్లు ఒకింత అసహనానికి గురవుతున్నారు.
అయితే… ఎస్బీఐ మాత్రం అక్రమ లావాదేవీలను నియంత్రించడం కోసమే ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అక్రమ లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదులు ఇటీవల ఎక్కువగా వస్తున్నట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో డిజిటల్, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. అక్టోబర్ 31 నుండి ఈ నిర్ణయం అమల్లోకి రానున్నట్టు ఎస్బీఐ ఓ ప్రకటన ద్వారా తెలిపింది.
అందుకు కారణం ఇదేనా?….
ఏటీఎంల ద్వారా నగదు విత్డ్రా తగ్గింపునకు అక్రమ లావాదేవీలే కారణమని చెబుతున్నా… అసలు కారణం వేరే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. బ్యాంక్ పై నగదు ఒత్తిడి బాగా ఉందని, దాని నియంత్రణకే ఈ చర్యలు అని చెబుతున్నారు. ఎస్బీఐ బ్యాంక్ శాఖల్లో కొన్ని నెలలుగా నగదు నిర్వహణ తలకు మించిన భారంగా మారింది. ముఖ్యంగా కొత్త రూ.100 నోట్లను అందుబాటులో ఉంచే విషయంలో బ్యాంక్ చేతులెత్తేసింది.