ముంబై: టెలికాం మార్కెట్లో అనేక సంచలనాలతో తన ప్రత్యర్థి కంపెనీలకు ఎప్పటికప్పుడు షాక్లు ఇస్తోన్న రిలయన్స్ జియో తాజాగా ఉద్యోగుల నియామకంలోనూ పెద్ద షాక్ ఇవ్వనుంది. ఉన్నట్లుండి జియో ఇన్ఫోకామ్ భారీగా ఉద్యోగాల నియామకాలకు తెరతీసింది. ఈ ఏడాది దాదాపు 75 వేల నుంచి 80 వేల మంది ఉద్యోగులను నియమించుకోవాలని జియో ప్రణాళికలు రచిస్తోంది. కంపెనీ విస్తరణ ప్రక్రియలో భాగంగా ఈ నియామకాలను జియో చేపడుతోంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో నైపుణ్యం కలిగిన ఉద్యోగులను కూడా జియో నియమించుకుంటోంది.
జియో నియమించుకునే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీమ్ ఆకాశ్ అంబానీ నేతృత్వంలో పనిచేయనున్నట్లు మింట్ నివేదిక కథనం. ఈ ఏఐ టీమ్ను నిర్మించడానికి ఇప్పటికే జియో కొంతమంది సీనియర్ అధికారులను నియమించిందని, బెంగళూరు లేదా హైదరాబాద్లో ఈ టీమ్ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆకాశ్ అంబానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీమ్పై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారని, ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించే బాధ్యతను ఆయన తన భుజాలపై వేసుకున్నారని జియో అధికారులను ఉటంకిస్తూ మింట్ తన కథనంలో పేర్కొంది.
ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు బెంగళూరులో మిగతా నియామకాల ప్రక్రియను కూడా జియో ప్రారంభించింది. మిషన్ లెర్నింగ్, బ్లాక్చెయిన్పై పనిచేసే వారిని కంపెనీ తీసుకుంటున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపారు. ఇప్పటి వరకు కంపెనీలో 1,57,000 మంది ఉద్యోగులున్నారని, మరో 75 వేల నుంచి 80 వేల మందిని నియమించుకోనున్నామని జియో చీఫ్ హ్యుమన్ రిసోర్స్ ఆఫీసర్ సంజయ్ జాగ్ తెలిపారు.
కంపెనీ ఇప్పటికే దేశవ్యాప్తంగా 6 వేల కాలేజీలతో భాగస్వామ్యం ఏర్పరుచుకుందని, దీనిలో టెక్నికల్ ఇన్స్టిట్యూషన్లు కూడా ఉన్నట్టు జాగ్ చెప్పారు. ‘రిలయన్స్ రెడీ’ అనే దాని కోసం కొన్ని కోర్సులను కూడా ఈ కాలేజీలు ఆఫర్ చేస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ సహకారంతో కూడా నియామకాలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. రెఫరల్స్ ద్వారా 60 శాతం నుంచి 70 శాతం నియామకాలు జరుపుతున్నామని, తమ రిక్రూట్మెంట్ ప్లాన్లో కాలేజీలు, ఎంప్లాయీ రెఫరల్స్ ప్రధాన భాగాలని జియో చీఫ్ హ్యుమన్ రిసోర్స్ ఆఫీసర్ సంజయ్ జాగ్ పేర్కొనడం గమనార్హం.