ముంబై : రిలయన్స్ జియో దెబ్బకు భారతీ ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్లు ఒక్కసారిగా ఢమాల్మన్నాయి. ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ తన కొత్త పోస్టు పెయిడ్ ప్లాన్ రూ.199తో టెలికాం దిగ్గజ కంపెనీలు ఎయిర్టెల్, ఐడియాలకు షాకిచ్చిన సంగతి తెలిసిందే.
చదవండి: ఈ ఏడాదిలోనే.. జియో బ్రాడ్బ్యాండ్ సేవలు!
జియో తాజాగా తీసుకొచ్చిన ఈ ప్లాన్పై అన్లిమిటెడ్ కాలింగ్, ఎస్ఎంఎస్, డేటా ప్రయోజనాలతో పాటు అంతర్జాతీయ కాలింగ్ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది. దీంతో శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఐడియా షేర్లు 8.1 శాతం మేర క్షీణించాయి. ఇది 2011 ఫిబ్రవరి నాటి కనిష్ట స్థాయిలు. ఎయిర్టెల్ షేర్లు కూడా 5.8 శాతం కిందకి పడిపోయాయి.
ఇప్పటికే తీవ్రంగా నష్టపోతున్న ఈ టెలికాం కంపెనీలను, జియో తన కొత్త కొత్త ప్లాన్లతో తరచూ దెబ్బతీస్తూనే ఉంది. ప్రస్తుతం జియో తీసుకొచ్చిన ఈ ప్లాన్కు కౌంటర్గా ఎలాంటి ప్లాన్లను ప్రకటించాలనే విషయంలో ప్రత్యర్థి కంపెనీలు ఎయిర్టెల్, ఐడియాలు మల్లగుల్లాలు పడుతున్నాయి.
త్వరలోనే ఈ కంపెనీలు కూడా తమ కొత్త ప్లాన్లను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయని జెఫెరీస్ పేర్కొంది. దీంతో ఒక్కో యూజర్తో పొందే సగటు రెవెన్యూ కూడా పడిపోనుంది. ఒకవేళ పోస్టు పెయిడ్ ధరల్లో 10 శాతం కోత పెడితే, ఈబీఐటీడీఏలు ఐడియావి 12 శాతం, ఎయిర్టెల్ కంపెనీవి 6 శాతం తగ్గిపోయే అవకాశాలున్నాయని కూడా జెఫెరీస్ తెలిపింది.