‘‘కొందరు ‘చిన్నపిల్లవేగా నీకేంటమ్మా సమస్య..’ అనేవాళ్లు. ఇంకొందరేమో ‘లైఫ్లో ఇదొక ఫేజ్ అంతే..’ అని చెప్పేవాళ్లు. నాకు రాత్రుళ్లు ఉన్నట్టుండి మెలకువ వచ్చేది, ఏడుపొచ్చేది. నాలో కోపం ఎందుకు పెరుగుతోందో కూడా ఆలోచించుకోలేకపోయా.. అసహనంతో తిండి బాగా తినేదాన్ని. దీంతో లావైపోయాను. చాలా సార్లు ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నా… ప్రతి సందర్భంలోనూ నేను చేసేది కరెక్టే అనిపించేది. అమ్మానాన్నలు, డాక్టర్లు చెప్పేది పనికిరాని విషయంగా అనిపించేది..’’ అంటూ ఒకప్పటి తన స్థితిని గుర్తుచేసుకున్నారు ‘దంగల్’ ఫేం జైరా వసీం.
ఆ రోజులు నిజంగా నరకమేనని, భయంకరమైన ఆ డిప్రెషన్ నుంచి కోలుకోవడానికి తనకు చాలా సమయం పట్టిందని, ఆ మాయదారి జబ్బు ఎప్పుడైనా, ఎవరికైనా ఎదురయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. గుండెలు పిండేసే రీతిలో ఈ మేరకు జైరా వసీం రాసిన లేఖ సంచలనంగా మారింది.
‘‘పాతికేళ్లు దాటిన వాళ్లకే డిప్రెషన్ ఉంటుందని ఎక్కడో చదివా. కానీ అది తప్పు. కౌమార దశ(10 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు)లోనూ దాని బారినపడతారు. అందుకు నేనే ఉదాహరణ. నాలుగేళ్ల చికిత్స తర్వాతగానీ నేను కోలుకోలేకపోయా. ఇప్పుడు నా గురించి నేను స్పష్టంగా, ధైర్యంగా ఆలోచించగలనన్న నమ్మకం ఏర్పడింది. కొన్నాళ్లపాటు అన్నింటికీ.. ముఖ్యంగా సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నా. రాబోయే పవిత్ర రంజాన్ మాసం అందుకు అనువైనదిగా భావిస్తున్నా. దయచేసి మీ ప్రార్థనల్లో నన్ను గుర్తుచేసుకోండి. ఒడిదొడుకుల్లో నాకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా నా ఫ్యామిలీకి ఒట్టి థ్యాంక్స్ చెబితే సరిపోదు..’’ అని జైరా తన లేఖలో పేర్కొన్నారు.
జైరా లేఖ యథాతథంగా..